Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

- Advertisement -

కౌంటర్‌ దాఖలుకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఏడుగురు ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ ట్రిబ్యునల్‌ చైర్మన్‌, స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. దానం నాగేందర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టి.ప్రకాశ్‌గౌడ్‌, ఎ.గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్యలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లను బుధవారం హైకోర్టు విచారించింది. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్‌ కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజరు, వివేకానంద, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి వేసిన పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారించింది. ఇప్పటికే దానం నాగేందర్‌పై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన కేసుతో వీటిని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అన్నింటినీ కలిపి ఏప్రిల్‌ 16న విచారిస్తామని ప్రకటించింది. సీనియర్‌ లాయర్‌ గండ్ర మోహన్‌రావు వాదిస్తూ, పిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం సమక్షంలో పీసీసీ అధ్యక్షుడి సారధ్యంలో కాంగ్రెస్‌లో చేరారని చెప్పారు. బహిరంగంగా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారనీ, పార్టీ మారినట్లుగా జరిగిన కార్యక్రమం అన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యిందని చెప్పారు. ఈమేరకు ఉన్న స్పష్టమైన ఆధారాలను పరిగణలోకి తీసుకోకుండా స్పీకర్‌ పిటిషన్లను ఏకపక్షంగా, అన్యాయంగా కొట్టేశారన్నారు. పలు పిటిషన్లపై ఒకేరోజు తీర్పు చెప్పారనీ, కొన్ని పిటిషన్లపై విడిగా తీర్పు చెప్పారని, పేర్లు మార్పు తప్ప తీర్పులన్నీ ఒకే తరహాలో ఉన్నాయన్నారు. దానం నాగేందర్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారని తెలిసి కూడా స్పీకర్‌ పట్టించుకోలేదన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్‌ హోదాలో ఉన్నారన్నారు. ఈ విషయాలను స్పీకర్‌ పట్టించుకోకుండా సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా పిటిషన్లను కొట్టేశారన్నారు. పార్టీ మార్పుపై పిటిషన్లు వేసి ఏడాది గడిచినా స్పీకర్‌ స్పందించలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత మాత్రమే స్పీకర్‌ చర్యలకు శ్రీకారం చుట్టారన్నారు. స్పీకర్‌ ఇచ్చిన తీర్పు ప్రతులు అందుబాటులో కూడా లేవన్నారు. వాదనల తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన హైకోర్ట్‌ తదుపరి విచారణను ఏప్రిల్‌ 16కు వాయిదా వేసింది.
3 వారాల్లోగా వినతులపై చర్యలు తీసుకోండి
జూబ్లీహిల్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది. వినతి పత్రాన్ని మూడు వారాల్లో పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. సొసైటీ పరిధిలో అనధికార నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడాన్ని ప్రశ్నిస్తూ సభ్యులు కె. జ్యోతిప్రసాద్‌, ఎం. ప్రభాకర్‌రావు వేసిన పిటిషన్లను జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌ కుమార్‌ విచారించారు. సొసైటీ ప్రాంగణంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని లాయర్‌ కోరారు. అనుమతిలేని రెస్టారెంట్‌, ఇతర వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలన్నారు. కమ్యూనిటీ సెంటర్లో ఏప్రిల్‌ మూడు నుంచి నిర్వహించనున్న ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్‌ను నిలిపివేయాలని కోరారు. దీనిపై హైకోర్ట్‌ పిటిషనర్లు సమర్పించిన ఫిర్యాదును మూడు వారాల్లో పరిశీలించి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -