అమ్మకాల నిర్ణయాన్ని సర్కారు వెనక్కి తీసుకోవాలి
లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తాం :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ధర్నాచౌక్లో మహాధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ సముదాయాల్లో ఉన్న వాణిజ్య దుకాణాలను వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ సముదాయాల్లో లిఫ్ట్లు, మెయింటెనెన్స్ ఖర్చుల కోసం షాపులను అమ్ముతున్నామన్న ప్రభుత్వ వాదన అర్ధరహితమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలపై భారం పడే, ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని, వేలం విక్రయాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్మించిన 16 డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లోని 992 వాణిజ్య సముదాయాలను వేలం పద్ధతిలో విక్రయించడానికి ఈ నెలాఖరు వరకు ఏర్పాట్లు చేయాలని 17న జిల్లా అడిషనల్ కలెక్టర్ ఒక ప్రకటన చేశారని గుర్తుచేశారు.
ఈ విక్రయాలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తోందన్నారు. షాపులను అమ్మితే వచ్చే డబ్బుతో శాశ్వత ప్రయోజనం ఉండదని, వేలం ద్వారా కిరాయికి ఇవ్వాలని కోరారు. కిరాయి ఇవ్వనివారిని బ్లాక్ లేదా ఖాళీ చేయించొచ్చన్నారు. దీని నిర్వహణ అంతా ప్రజలు ఎన్నుకొన్న కమిటీ పర్యవేక్షిస్తుందని, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చునని వివరించారు. ఫలితంగా షాపుల ద్వారా వచ్చే కిరాయిలే మెయింటెనెన్స్కు ప్రధాన వనరుగా మారతాయని, వాటిని అమ్మేయడం వల్ల భవిష్యత్లో ఆ డబ్బు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు మెయింటెనెన్స్ భారం మొత్తం పేదలపైనే పడుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ వైఖరి సరికాదు
షాపుల అమ్మకం ద్వారా వచ్చే డబ్బును డబుల్ బెడ్రూమ్ వాసులకే ఖర్చు చేస్తామనేది కేవలం సాకు మాత్రమేనని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. బాధ్యతల నుంచి తప్పుకోవడానికే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తున్నదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మరమ్మతులకు రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు కేటాయించాలి తప్ప, పేదల ఆస్తులను అమ్మడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఈ ధర్నాకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు.
పోరాటం ఆగదు
డబుల్ బెడ్రూమ్ సముదాయాల్లో వాణిజ్య దుకాణాల అమ్మకాలను విరమించుకోవాలని సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్లలో మరమ్మతులకు బడ్జెట్ కేటాయింపులు చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే రవి, ఏ అశోక్, ఎం వినోద, జి శ్రీనివాస్, ఐ రాజశేఖర్, నాయకులు ఎం నరేష్, బి లింగస్వామి, ఎన్ శ్రీనివాస్, జే వెంకన్న, ఎన్ సబిత, గణేష్, బీ నర్సింగ్రావు, శ్రీనివాస్రావు, విజయ్, రవీందర్, బాబురావు, అనిల్, రమాదేవి, నర్సింహా, రాజేందర్, దివ్య, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



