Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

- Advertisement -

కడియం శ్రీహరి, ఎం. సంజయ్ కుమార్‌లు కౌంటర్లు దాఖలు చేయాలి: హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ఎం. సంజయ్ కుమార్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ స్పీకర్‌ కమ్‌ ట్రైబ్యునల్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. వాళ్లకు వ్యక్తిగతంగా నోటీసులు అందజేయడానికి పిటిషనర్లకు అనుమతి ఇచ్చింది. వీరిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను స్పీకర్‌ కొట్టేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కె.పి. వివేకానంద, జి. జగదీశ్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారించింది.

ఇప్పటికే ఏడుగురు పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దానం నాగేందర్‌పై బీజేపీ వేసిన పిటిషన్‌లో కూడా ఇది వరకే నోటీసులు ఇచ్చింది. ఈ కేసులన్నింటినీ కలిపి వచ్చే నెల 16న విచారిస్తామని డివిజన్‌ బెంచ్‌ ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్టుగా కచ్చితమైన ఆధారాలు చూపినా వాటిని స్పీకర్‌ పట్టించుకోలేదని, ట్రిబ్యునల్‌ చైర్మెన్‌ హోదాలో స్పీకర్‌ ఇచ్చిన తీర్పు చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్‌ లాయర్‌ వాదించారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన ఇతర కేసులతో కలిపి విచారిస్తామని బెంచ్‌ స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -