సిలువ రూపంలో యేసు ప్రతిమ… గుడ్ ఫ్రైడేకు వినూత్న నివాళి
నవతెలంగాణ – కాటారం
గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని కాటారం గిరిజన గురుకుల కళాశాల చిత్రకళ ఉపాధ్యాయుడు, సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజినీకాంత్ తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. చాక్ పీస్పై సిలువ వేయబడిన యేసుక్రీస్తు కళారూపాన్ని అద్భుతంగా రూపొందించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కేవలం 3.5 సెంటీమీటర్ల ఎత్తు, 2.8 సెంటీమీటర్ల వెడల్పుతో ఉన్న ఈ సూక్ష్మ శిల్పాన్ని ఆయన సుమారు మూడు గంటల పాటు కష్టపడి, గుండు పిన్ సహాయంతో స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా చెక్కారు. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన ఈ కళాఖండం చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు.
ప్రత్యేక దినోత్సవాలను పురస్కరించుకుని చాక్ పీస్లపై విభిన్న కళారూపాలను రూపొందించడం రజినీకాంత్ ప్రత్యేకత. ప్రపంచంలోనే అతి చిన్న జాతీయ పతాకాన్ని రూపొందించి క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన ఆయన, పలు అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు. వివిధ వరల్డ్ రికార్డుల్లో తన పేరును నమోదు చేసుకుని కళారంగంలో గుర్తింపు పొందారు. ఇలాంటి వినూత్న కళా సృష్టులతో సమాజానికి సందేశాన్ని అందిస్తున్న రజినీకాంత్ ప్రతిభకు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.



