నవతెలంగాణ-హైదరాబాద్: డయాబెటిస్ కేసులు పెరుగుతుండటంతో చక్కెర ధరల పెంపు ప్రజలపై పెద్దగా ప్రభావం చూపదని బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇప్పటికే చక్కెరను తక్కువగా తీసుకుంటున్నారు. అందరూ మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో స్వీట్లు ఎవరు తింటున్నారు? చక్కెర ధర పెరుగడం వల్ల పెద్దగా తేడా ఏమీ ఉండదని నా భావన. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని మీడియాతో అన్నారు.
కాగా, మంత్రి శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలను స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఆయన నుంచి ప్రజలు ఏమి ఆశించగలరని వ్యాఖ్యానించారు. ‘ఆవు పేడపై ఎంత నెయ్యి పోసినా, అది ఆవు పేడ రుచినే కలిగి ఉంటుంది. అలాంటి మంత్రి నుంచి మీరు ఏమి ఆశించగలరు? గ్యాస్, టమాటో ధరలు పెరిగినప్పుడు స్మృతి ఇరానీతో సహా అనేక మంది ప్రముఖ నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు. కానీ నేడు చక్కెర ధరలు పెరిగినప్పుడు మాత్రం వారు మధుమేహం (డయాబెటిస్) గురించి మాట్లాడుతున్నారు. అసలైన అతిపెద్ద మధుమేహం ఈ ప్రభుత్వమే’ అని ఆయన అన్నారు.


