జులై నాటికి 15.4 శాతం వృద్ధి
2016 తర్వాత ఇదే గరిష్టం
కేర్ఎడ్జ్ రేటింగ్స్ వెల్లడి
ముంబయి : బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకం, పొదుపు ధోరణి పెరుగుతోంది. గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో ఇటీవల డిపాజిట్లపై ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకం, పొదుపు ధోరణి పెరుగుతోంది. ఈ ఏడాది జులై 31 నాటికి బ్యాంకుల డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 15.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2016 డిసెంబర్ తర్వాత డిపాజిట్ల వృద్ధి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతక్రితం జులై 15 నాటికి డిపాజిట్ల వృద్ధి 12.7 శాతంగా ఉండగా, గతేడాది ఇదే సమయంలో 10 శాతంగా నమోదయ్యింది.
రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక స్వాప్
సదుపాయం కింద విదేశీ కరెన్సీ ప్రవాస భారతీయుల బ్యాంకు డిపాజిట్లకు భారీ స్పందన లభించడం ఈ వృద్ధికి ప్రధాన కారణమని కేర్ఎడ్జ్ రేటింగ్స్ పేర్కొంది. జులై 31 నాటికి ఈ సదుపాయం ద్వారా సమీకరించిన నిధులు 36.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో బ్యాంకులకు అదనపు విదేశీ మారకద్రవ్య నిధులతో పాటు ద్రవ్యలభ్యత కూడా పెరిగిందని నివేదిక తెలిపింది.
రెండు వారాల్లోనే 6.57 లక్షల కోట్లు..
బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం డిపాజిట్లు రూ.269.4 లక్షల కోట్లకు చేరాయి. కేవలం రెండు వారాల వ్యవధిలోనే రూ.6.57 లక్షల కోట్ల మేర కొత్త డిపాజిట్లు వచ్చాయి. ఇందులో కాలపరిమితి డిపాజిట్లు 14.8 శాతం వృద్ధితో రూ.235.1 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం డిపాజిట్లలో వీటి వాటా 87.3 శాతంగా ఉంది. మరోవైపు డిమాండ్ డిపాజిట్లు కూడా 19.3 శాతం వృద్ధి చెందడం బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకం, పొదుపు ధోరణి బలపడుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది.
రుణాల్లోనూ
19 శాతం
వృద్ధి
డిపాజిట్ల పెరుగుదలకు అనుగుణంగా బ్యాంకుల రుణ విస్తరణ కూడా కొనసాగుతోంది. రిటైల్ రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సేవలు, మౌలిక వసతులు, ఎన్బిఎ ఫ్సిలకు రుణాల అందజేత పెరగడంతో జులై 31 నాటికి బ్యాంకుల రుణ వృద్ధి 19.3 శాతానికి చేరుకుంది. మొత్తం బకాయి రుణాలు రూ.220.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. డిపాజిట్ల వృద్ధి వేగం పెరగడంతో రుణాలు, డిపాజిట్ల మధ్య వ్యత్యాసం కూడా తగ్గింది. రుణాలు–డిపాజిట్ల నిష్పత్తి 82.7 శాతం నుంచి 81.9 శాతానికి తగ్గడం బ్యాంకుల నిధుల స్థితి మరింత సమ తుల్యతకు నిదర్శనమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.



