నవతెలంగాణ-సంగారెడ్డి
సిపిఎస్ రద్దు చేసి, పిఆర్సి అమలు చేయాలని, డిఎలు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై. జ్ఞాన మంజరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ సమావేశం కేవల్ కిషన్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ సంగారెడ్డి వద్ద పిఆర్సి అమలు చేయాలని, 6 డిఎలు ప్రకటన, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సిపిఎస్ విధానం రద్దు చేయాలని తదితర డిమాండ్ ల సాధన కోసం టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయ మిత్రులంతా తప్పకుండా సమయానికి హాజరై ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
టీచర్లు సమస్యలతో సతమతమవుతూ అసంతృప్తి, అసహనం, ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ధర్నాలో పాల్గొని వీటిని నిరసన రూపంలోకి మార్చితే సమస్యలను సాధించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్, బి. సాయిలు, కోశాధికారి పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



