పేద విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థిక సాయం అందజేత
నవతెలంగాణ – తిమ్మాజిపేట
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామానికి చెందిన కొంగరి గౌరమ్మ, బాలస్వామి దంపతుల కుమార్తె రేవతి బి.పీ.ఎడ్ కోర్సులో సీటు సాధించింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కళాశాల ఫీజు చెల్లించడం కష్టంగా మారింది. విషయం తెలుసుకున్న నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విద్యార్థిని రేవతి ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా బి.పీ.ఎడ్ కోర్సు మొదటి సంవత్సరం ఫీజు రూ.32,000/- చెక్కును అందజేసి అండగా నిలిచారు. విద్యార్థిని రేవతి కోర్సును విజయవంతంగా పూర్తి చేసే వరకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ పూర్తి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. “పేదరికం ఏ విద్యార్థి కలలకు అడ్డంకి కాకూడదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదన్నదే నా ఆకాంక్ష. చదువుకోవాలనే తపన ఉన్న ప్రతి పేద విద్యార్థికి నా వంతు సహాయం అందిస్తాను. రేవతి తన కోర్సును విజయవంతంగా పూర్తి చేసి, మంచి భవిష్యత్తును నిర్మించుకునే వరకు అండగా ఉంటా”ను అని తెలిపారు. పేద విద్యార్థుల విద్యకు ఆర్థిక సహాయాలు అందిస్తూ, వారి భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్న మర్రి జనార్దన్ రెడ్డికి విద్యార్థిని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.



