నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఇటీవల రెండు రోజులు కురిసిన ముసురు, కొద్దిపాటి వర్షానికి, ఆలేరు పట్టణంలో రైల్వే గేట్ అండర్ పాస్ వద్ద నీరు నిలిచిపోవడంతో పట్టణంలోని ద్విచక్ర వాహనాలు, కార్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొంతమంది వాహనదారులు చేసేదేమీ లేక ఆ వర్షపు నీటిలో నుండే తడుచుకుంటూ మెయిన్ రోడ్ వైపు ప్రయాణించారు. కొంతమంది వాహనా దారులు పోచమ్మ గుడి నుండి ఆర్ఓబి మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది. చేర్యాల సిద్దిపేట, చేర్యాల,బచ్చన్నపేట ల వైపు నుండి వచ్చే వాహనాల పరిస్థితి అదే విధంగా ఉంది.
రైల్వే గేట్ అండర్పాస్ లో వచ్చి చేరే నీరును మోటార్ల ద్వారా ఎత్తి నీరు నిలవకుండా చూడాలని ద్విచక్ర వాహనదారులు, మున్సిపల్ అధికారులను, ప్రజా ప్రతినిధులని కోరారు. ఆలేరు పట్టణంలో పెద్దమ్మ వాడ 12వ వార్డులోని కాలనీలలో వర్షం నీరు వచ్చి చేరింది. కురిసిన వర్షాల కారణంగా పంటలకు ఎంతో కొంత మేలు చేకూరుతుందని రైతులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంట, ఇతర పంటలు వేసిన రైతు సోదరులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మండల వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాస్ తెలియజేశారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షాలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి పట్టణ ప్రజలకు తెలియజేశారు. రెండు రోజులు వర్షాలు రావడంతో పట్టణంలో దోమలు వృద్ధి చెందాయి. పట్టణంలోని 12 వార్డులలో దోమల నివారించేందుకు రసాయనాలు పిచికారి చేయాలని ప్రజలు మున్సిపల్ అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.


