నవతెలంగాణ-హైదరాబాద్: ఏకరూప పౌరస్మృతి (యూసీసీ)ని బీజేపీ దొడ్డిదారిన అమలు చేయడాన్ని మానుకోవాలని జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు, మీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాకుండా, పార్లమెంటులో చట్టం చేసి యూసీసీని అమలు చేయాలని బీజేపీకి సవాలు విసిరారు. మోడీ ప్రభుత్వం దోడ్డిదారిలో కాకుండా, తగిన సంఖ్యా బలం ఉంటే పార్లమెంటులో చట్టం చేయాలని హెచ్చరించారు. పలు రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్డిఎలోని అనేక మిత్రపక్షాలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయని, అందుకు పార్లమెంటుకు తీసుకువచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. బీహార్లో యూసీసీ అమలును ఎన్డిఎ మిత్రపక్షమైన జేడీ(యు) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. ఎన్డీఎ మిత్రపక్షాలే సిద్ధంగా లేనపపుడు .. దేశమంతటా ఎలా అమలు చేయాలని ఆదేశాలివ్వగలరని ప్రశ్నించారు.
కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అమలు చేస్తే, ఆ విధానాన్ని సార్వత్రికం అని అనలేమని అన్నారు. ఇటువంటి అంశంపై నిర్ణయం వ్యక్తిగత రాష్ట్రాల పరిధిలో ఉండకూడదని, పార్లమెంటు ద్వారా జాతీయ స్థాయిలో దీనిని పరిష్కరించాలని” ఆయన అభిప్రాయపడ్డారు. నియంత్రణ రేఖ లేదా వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతను తగ్గించే ఏ చర్య అయినా మంచి ముందడుగు అని అన్నారు. ముఖ్యంగా ఆ నియంత్రణ రేఖకు సమీపంలో నివసించే ప్రజలకు ఇది ఎంతో మేలు చేస్తుందని, అక్కడ నివసించే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో మనకి అందరికీ తెలుసని అన్నారు. అలాగే భవిష్యత్తుఓల నియంత్రణ రేఖ వెంబడి కూడా పరిస్థితులు మెరుగుపడతాయని తాము ఆశిస్తున్నామని అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని బ్రిక్స్ సదస్సు ఖండించడమనేది భారత విదేశాంగ విధానం సాధించిన విజయమని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.



