ఒక్కొక్కరికి రూ.300 జరిమానా..
నవతెలంగాణ – ముధోల్
దోపిడీ కేసులో ఇద్దరు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, ఒక్కొక్కరికి రూ.300 జరిమానా విధిస్తూ నిర్మల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించిందని ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సెస్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. 2017 సెప్టెంబరు 27న అర్ధరాత్రి రామాయంపేట నుంచి ఔరంగాబాద్ వైపు ఐచర్ వాహనంలో వెళ్తున్న మహ్మద్ అజీజ్ వాహనాన్ని ముధోల్ మండలంలోని సరస్వతీనగర్ సమీపంలో స్కార్పియోలో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు.
అనంతరం క్యాబిన్లోకి ప్రవేశించి అజీజ్పై దాడి చేసి రూ.24 వేల నగదు, రూ.13 వేల విలువైన శాంసంగ్ మొబైల్ ఫోన్, డ్రైవింగ్ లైసెన్స్ను దోచుకున్నారు. ఘటనపై ముధోల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ కేసును పోలిసులు పటిష్టంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులపై నేరం రుజువు చేసేందుకు అవసరమైన ఆధారాలను న్యాయస్థానంలో సమర్పించారు. దీంతో మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన ఇమ్రాన్ ఖురేషీ, నిజామాబాద్ కు చెందిన అన్వర్ ఖాన్ లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.300 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందిని ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్లో ఎస్ఐ కె. రమేష్, అసిస్టెంట్ కోర్టు ఎల్ఓ ఎం. ప్రభాకర్, ముధోల్ సీడీఓ మహేందర్సింగ్ తదితరులు కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రాసిక్యూషన్ అధికారిని నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, అభినందించారు.



