– రైతు ఉద్యమానికి ఆయన సేవలు చిరస్మరణీయం
– సంఘం జిల్లా నాయకులు దొడ్డా లక్ష్మినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరజీవి కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డికి తెలంగాణ రైతు సంఘం దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. స్థానిక సుందరయ్య భవన్లో సంఘం మండల అధ్యక్షులు మోరంపూడి రామమోహన్రావు అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. తొలుత మల్లారెడ్డి చిత్రపటానికి సంఘం సీనియర్ నాయకులు యండ్రాతి అప్పారావు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డా లక్ష్మీనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బుడితి చిరంజీవినాయుడు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహించిన మహోన్నత వ్యక్తి సారంపల్లి మల్లారెడ్డి అని కొనియాడారు. వ్యవసాయం, నీటిపారుదల, సహకార, పంచాయతీరంగాలపై ఆయనకు లోతైన అవగాహన ఉందని తెలిపారు.
నిరాడంబర జీవితాన్ని గడిపిన మల్లారెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన అందించిన జ్ఞానం, బోధనలు, ఉద్యమ స్ఫూర్తి మనలో కొనసాగుతున్నాయని అన్నారు. ఆయన మరణం రైతు సంఘం ఉద్యమానికి, మార్క్సిస్టు పార్టీకి, రైతాంగానికి తీరని లోటని పేర్కొన్నారు. సారంపల్లి మల్లారెడ్డి నిర్మించిన రైతు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్, మండల కన్వీనర్ మురహరి రఘు, కుంజా మురళి, పెనుబల్లి లక్ష్మి, పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



