వరద బాధితులకు ఎక్స్‌గ్రేషియా అందించాలి

– సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో 2020లో వచ్చిన వరదల్లో చిక్కుకుని మృతిచెందిన 19 మందికి సంబంధించి తక్షణమే ఆ కుటుం బాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని సీపీఐ (ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి ఈమెయిల్‌ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. 2020 అక్టోబర్‌ నెలలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భారీ వర్షాలు, వరదలకు పలువురు మృతిచెందారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.5లక్షలు చెలిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎక్స్‌గ్రేషియా అందించలేదన్నారు. బాధిత కుటుంబాలు రంగారెడ్డి కలెక్టర్‌ కార్యాలయం, సచివాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పనిచేస్తూ గగన్‌పహాడ్‌ వద్ద వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన నల్లమోతు మాధవరావు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించాలని అనేక సార్లు తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. ఐదు లక్షలున్న ఎక్స్‌గ్రేషియాను రూ. నాలుగు లక్షలు తగ్గించిన ప్రభత్వం.. బాధితులకు ఇప్పటి వరకు సహాయం చేయలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా బాధితులకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందించాలని ఎం.శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు.

Spread the love