– సమాజంలోని జాఢ్యాలను ఎత్తిచూపిన ‘ఊసరవెల్లి’ నాటకం
– మతం కాదు మానవత్వమే ముద్దు అని చాటిచెప్పిన ‘ఇస్త్రీపెట్టె’ షార్ట్ ఫిలిం
– కదిలించిన ‘ఎగువవారు..దిగువవారు’, ‘నీ కులం ఏంటి’ షార్ట్ ఫిలిమ్స్
– అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ధూంధాం
– ‘భరతమాత కడుపులో చిచ్చు రగులుతోంది’ పాటకు నృత్యం చేసిన ఎస్వీకే టీమ్
– మతం గుప్పిట్లో కులం పుస్తకావిష్కరణ
– నూర్జాహాన్ మృతికి సంతాపం తెలిపి మౌనం పాటించిన సభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల నిర్మూలన సాంస్కృతిక ఉత్సవాలు వీక్షకులను ఆలోచింపజేసేలా, చైతన్యపరిచేలా సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్తేజ పూరిత వాతావరణంలో కొనసాగాయి. ఆటాపాటలతో కళా కారులు సభా ప్రాంగణాన్ని ఉర్రూతలెత్తించారు. మనిషిని మనిషిగా ఆలోచించకుండా చేస్తున్న సమాజంలోని గూడు కట్టుకున్న జాఢ్యాలను కండ్లకట్టినట్టుగా ‘ఊసరవెల్లి’ వ్యంగ్య నాటకం ద్వారా సింగపంగ ప్రభాకర్ బృందం చూపెట్టింది. డబ్బు, మద్యం, విందుల ద్వారా రాజకీయనాయకులు ఎలా ఎదుగుతున్నారు? తమకు జైకొట్టేలా భజన బృందాన్ని ఎలా తయారు చేసుకుంటున్నారు? ప్రజలను కులం, మతం, రాజకీయాల పేరుతో విడగొట్టి ఓడిన, గెలిచిన నేతలు సమాజాన్ని ఎలా దోపిడీ చేస్తున్నారు? అనే దృశ్యాన్ని ఆ నాటకంలో ఆవిష్కరించింది. ప్రజాసమస్యలను గాలికొదిలేసి రేటింగ్ల కోసం మీడియా ఛానళ్లు అనుసరిస్తున్న ధోరణిని నవ్వు పుట్టిచూస్తూనే ఎత్తిచూపింది. హత్యలు, లైంగిక దాడులు దోపిడీలు జరుగుతున్నా ప్రజల్లో అసంతృప్తి పెరగ కుండా పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాలను కండ్లకు కట్టినట్టు చూపెట్టింది. రోజుకొకరు చొప్పున పుట్టుకొస్తున్న స్వామిజీలు ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నారనే విషయాన్ని బట్టబయలు చేసింది. కొంచెం నిడివి పెద్దదైనప్పటికీ ‘ఊసరవెల్లి’ నాటకం ఆద్యంతం వ్యంగంగా, ఆలోచింపజేసేలా పదునైన డైలాగులతో రక్తికట్టించింది. సాంస్కృతికోత్సవాల్లో లక్ష్మీ నాగేశ్వర్ రచించిన ‘మతం గుప్పిట్లో కులం’ అనే పుస్తకాన్ని సీఎల్ గాంధీ, వాహిద్, గుత్తా జ్యోత్స్న ఆవిష్కరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం బృందం ‘భరతమాత కడుపులో చిచ్చు రగులుతోంది… మనువాదుల చెరలో చిక్కి విలపిస్తోంది’ అనే పాటకు డ్యాన్స్ చేసింది. ఈ పాటను దశరథ్ రాయగా వేముల ఆనంద్ పాడిన విషయం విదితమే.
ఆలోచింపజేసిన షార్ట్ఫిలిమ్లు
కులం, మతం రక్కసిలు మన దేశాన్ని ఎలా పట్టిపీడిస్తు న్నాయి? అనే విషయాలను ‘ఇస్త్రీపెట్టె’, ‘నీ కులం ఏంటి’, ‘ఎగువవారు…దిగువవారు’ అనే షార్ట్ ఫిలిమ్లు బాగా ఆలోచింపజేశాయి. ఆపద సమయంలో కులం, మతం అక్కరకురావు మనుషులను అక్కున చేర్చుకునేది మాన వత్వం, మనిషి మంచితత్వమేననీ, విద్వేషాలు, వైషమ్యాలు లేకుండా మనుషులు కలిసి ఉంటే ఎంత ప్రశాంతమైన జీవితాన్ని గడుపొచ్చు అనే మంచి సందేశాన్ని ఇచ్చాయి.
విమలక్క బృందం ధూంధాం
విమలక్క సారధ్యంలోని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య బృందం వేదికపై ధూంధాం చేసింది. డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ ఉర్రూతలూగించింది. కోలాట ప్రదర్శన చేపట్టింది. కుల నిర్మూలన పోరాటంలో సాహిత్యం, ఆటాపాటలు ఆయుధాలని నొక్కి చెప్పింది. మావి వెలివాడలు కావు..వెలుగు జాడలు అని లఘునాటకాన్ని ప్రదర్శించింది. విమలక్క ఆలపించిన పాటలు సభికుల్లో జోష్ను నింపాయి.
నూర్జహాన్ మృతికి సంతాపం
ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్ భార్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నూర్జహాన్ మృతికి కులనిర్మూలన సాంస్కృతికోత్సవాల్లో సంతాపం ప్రకటించారు. రెండు నిమిషాల పాటు సభలో మౌనం పాటించారు. వేముల ఆనంద్, నూర్జహాన్ మతాంతర వివాహం చేసుకున్న విషయం విదితమే.



