ప్రభుత్వ లాంఛనాలతో ఆశాభోస్లే అంత్యక్రియలు
తుది నివాళి అర్పించిన ప్రముఖులు
వీధుల్లో బారుల తీరిన వేలాది మంది అభిమానులు
ముంబయి : ఎనిమిది దశాబ్దాల పాటు తన గానంతో తరతరాలను మంత్రముగ్ధులను చేసిన దిగ్గజ గాయని ఆశా భోస్లే అంత్యక్రియలను సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. స్వరరాణికి తుది నివాళులు అర్పించేందుకు సినీ, సంగీత, రాజకీయ, క్రీడా, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖలతో పాటు, వేలాది మంది అభిమానులు తరలిరావడంతో ముంబయి నగరం సోమవారం భావోద్వేగభరితమయింది. ఆదివారం తుదిశ్వాస విడిచిన ఆశభోంస్లే భౌతికకాయంను లోయర్ పరేల్లోని ఆమె నివాసంలో ఉంచారు. ఇక్కడ కుటుంబ సభ్యులు, ప్రముఖులు, అభిమానులు నివాళర్పించిన తరువాత ఊరేగింపుగా శివాజీ పార్క్ శ్మశాన వాటికు తీసుకుని వెళ్లారు. మహారాష్ట్ర పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే ఆమె చితికి నిప్పటించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిండే, సునేత్ర పవార్, భోస్లే సోదరి ఉషా మంగేష్కర్, నటులు అమిర్ ఖాన్, విక్కీ కౌశల్ ఇతరలు పాల్గొన్నారు. భోంస్లేకు నివాళిగా గాయకుడు షాన్ భోస్లే ఒక గీతాన్ని ఆలపించారు. కాగా, ఆశా భోస్లే భౌతికకాయం ఉంచిన వాహనం లోయర్ పరేల్ నుంచి మధ్యహ్నాం బయలు దేరి దాదాపు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న శివాజీపార్క్ శ్మశాన వాటికకు సుమారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో చేరుకుంది. ఆశాకు ఇష్టమైన తెలుపు, పసుపు రంగు పువ్వులతో అలంకరించి, సాంప్రదాయ మహారాష్ట్ర ‘నాథ్’ (ముక్కుపుడక) ధరించిన ఆశా భోంస్లే భారీ చిత్రపటం ఉంచిన ఒక తెల్లటి వాహనంలో ఈ భౌతికకాయాన్ని ఉంచారు. అంతిమయాత్ర వెంట వందలాది మంది సాగారు. ఇంకా అనేక మంది వీధుల వెంబడి బారులు తీరారు. మేడలపైన, కిటీకల మీదా నుంచి కన్నీటీతో ఆశాకు వీడ్కోలు పలికారు. అలాగే, అంత్యక్రియలను నిర్వహించే ప్రదేశం సమీపంలో గుమిగూడి ఉండొద్దని భోంస్లే కుటుంబం, పోలీసు అధికారులు పదేపదే విజ్ఞప్తి చేసినా, శివాజీ పార్క్లోనూ, సమీపంలోనూ భారీగా అభిమానులు చేరుకున్నారు. శివాజీ పార్క్ వద్ద క్యూ వందల మీటర్ల పొడవు మేర విస్తరించింది. అభిమానులు ప్లకార్డులు, ఫోటోలు పట్టుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీగా అభిమానులు చేరుకోవడంతో పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించారు.
కన్నీటి వీడ్కోలు
- Advertisement -
- Advertisement -



