Wednesday, April 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిస్తృతస్థాయిలో చర్చలు జరపండి

విస్తృతస్థాయిలో చర్చలు జరపండి

- Advertisement -

తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి…

డీలిమిటేషన్‌పై ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌ రెడ్డి లేఖ
మహిళా రిజర్వేషన్లకు తాము పూర్తి మద్దతునిస్తామని స్పష్టీకరణ
‘ప్రొరేటా’తో మనకు తీవ్ర నష్టం.. కలిసికట్టుగా వ్యతిరేకిద్దాం : దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు విడివిడిగా లేఖలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌


నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత స్థాయిలో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఏకాభిప్రాయ సాధన ద్వారానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇది దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం కలిగించే అంశం కాబట్టి తాను బాధ్యతతో అత్యవసరంగా లేఖ రాస్తున్నానని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళల రిజర్వేషన్‌, పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి ప్రజలలో గందరగోళం సష్టిస్తున్నారని విమర్శించారు. అవి పూర్తిగా వేర్వేరు విషయాలని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. ప్రస్తుతమున్న 543 లోక్‌సభ సీట్లలోనే 33 శాతం మహిళల రిజర్వేషన్‌ను యథాతథంగా వెంటనే అమలు చేయాలని, అన్ని రాష్ట్ర అసెంబ్లీల్లో కూడా అమలు చేయాలని కోరారు. మహిళల రాజకీయ సాధికారత కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యానికి ఒక నైతిక అవసరమని సీఎం పేర్కొన్నారు.

పునర్విభజనకు సంబంధించి గతంలో కూడా సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మార్చుతూ డీలిమిటేషన్‌ నిర్వహించినట్టు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్టవచ్చని తెలిపారు. లోక్‌సభ సీట్లను 850కు పెంచే ప్రతిపాదనే అసలైన వివాదాస్పద అంశమని పేర్కొన్నారు. ప్రస్తుత సీట్లను పెంచి వాటిని ప్రొరేటా పద్ధతిలో కేటాయించే ఆలోచనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రిజర్వేషన్‌కు పూర్తి మద్దతు ఇవ్వటంతో పాటు, సీట్ల సంఖ్య పెంపు లేకుండా డీలిమిటేషన్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.
జనాభా లేదా ప్రొరేటా పద్ధతిలో లోక్‌సభ సీట్ల పెంపు ప్రతిపాదనను అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించబోవని సీంఎ స్పష్టం చేశారు. ప్రొరేటా పద్ధతిలో అమలు చేస్తే దేశంలో తలెత్తబోయే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 1970ల నుంచి దేశం జనాభా నియంత్రణ విధానంపై దృష్టి పెట్టినప్పటికీ, రాష్ట్రాల వారీగా జనాభా నియంత్రణ అమలు జరిగిన తీరు భిన్నంగా ఉందని గుర్తు చేశారు. జనాభాలో తేడాల వల్ల జాతీయ ఐక్యతపై ప్రభావం పడే ప్రమాదాన్ని గుర్తించి, ఇందిరా గాంధీ, అటల్‌ బిహారి వాజ్‌పేయి వంటి నాయకులు ఈ అంశాన్ని ఒక్కోసారి 25 సంవత్సరాల పాటు వాయిదా వేసినట్టు వివరించారు. ఆర్థిక సహకారం, సామాజిక, మానవ అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రొరేటా పద్ధతిలో సీట్లను పెంచితే దేశ ఫెడరల్‌ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు.

వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు అన్ని ప్రాంతాల సమాన ప్రాతినిథ్యం దేశానికి అత్యంత కీలకమని నొక్కి చెప్పారు. సీట్ల పెంపుతో దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని కేంద్రం పూర్తిగా విశ్లేషించలేదని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు దశాబ్దాలుగా జనాభా స్థిరీకరణ, ఆరోగ్యం, మానవాభివృద్ధి రంగాల్లో కృషి చేశాయని తెలిపారు. ఇవన్నీ జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రతిపాదనతో ఈ రాష్ట్రాలన్నీ నిర్మాణాత్మకంగా నష్టపోతాయని, రాజకీయంగా బలహీనపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొరేటా మోడల్‌ కేవలం గణాంకాల మార్పుగా కాకుండా, రాజకీయ అసమతుల్యతకు దారి తీస్తుందని హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీలో ఇప్పటికే పక్షపాతం, వివక్ష కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ఎక్కువ నిధులు పొందుతుంటే, తెలంగాణకు తక్కువ నిధులు వస్తున్నాయని ఉదహరించారు.

ఇది దక్షిణాది-ఉత్తరాది అసమానతకు సంకేతమని పేర్కొన్నారు. నిధుల వివక్షకు అదనంగా ఇప్పుడు సీట్ల పెంపు కారణంగా రాజకీయంగా అన్యాయం కూడా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరించినప్పటికీ, పార్లమెంట్‌లో ఆయా రాష్ట్రాల ప్రాధాన్యం, ప్రాతినిధ్యం తగ్గిపోతుందని వాపోయారు. జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది-మధ్య ప్రాంత రాష్ట్రాలు లాభపడతాయని తెలిపారు. దీని వల్ల అభివృద్ధిలో పాలుపంచుకున్న రాష్ట్రాలకు శిక్ష పడుతుందని, జనాభా పెరిగిన రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది కేవలం అంకెల విషయం కాదని, దేశ సమగ్రత, సమానత్వం, న్యాయానికి సంబంధించిన ప్రాథమిక అంశమని స్పష్టం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలు జాతీయ ఆదాయానికి నిరంతరం సహకరిస్తూ, సుపరిపాలన, అభివృద్ధి ప్రమాణాలు కొనసాగిస్తున్నాయని సీఎం తెలిపారు. ఈ కృషిని పట్టించుకోకపోతే దేశ ఐక్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రొరేటా మోడల్‌ను దక్షిణ రాష్ట్రాలు అంగీకరించబోవని, ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నమవుతుందని హెచ్చరించారు. అందువల్ల అందరికీ న్యాయం జరిగేలా ఒక స్థిరమైన పరిష్కారం అవసరమని సూచించారు. హైబ్రిడ్‌ మోడల్‌ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందరి ప్రాతినిధ్యంతోపాటు అన్ని రాష్ట్రాల సహకారాన్ని ఈ మోడల్‌ సమతుల్యం చేస్తుందని వివరించారు. సుప్రీంకోర్టు సూచించిన 50 శాతం-50 శాతం విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. హైబ్రిడ్‌ మోడల్‌ ప్రకారం, కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ప్రొరేటా పద్ధతిలో, మిగతా సగాన్ని రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం, అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రక్రియ అందరికీ న్యాయంగా, ఆమోదయోగ్యంగా ఉండే ఉత్తమ పరిష్కారాన్ని కనుగొంటుందని పేర్కొన్నారు. హైబ్రిడ్‌ మోడల్‌ ద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండటంతో పాటు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందని సీఎం తెలిపారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావాలని ప్రధానిని కోరారు. భారతదేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని, ఇలాంటి కీలక నిర్ణయాలు ఆ ఏకత్వాన్ని బలోపేతం చేసేలా ఉండాలని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ న్యాయం చేసే పరిష్కారాన్ని కనుగొంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొరేటా పద్ధతిలో లోక్‌సభ సీట్లను పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్ఛేరి ముఖ్యమంత్రులకు… సీఎం రేవంత్‌ రెడ్డి విడివిడిగా లేఖలు రాశారు. అందరం కలిసికట్టుగా ఉండి, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -