Friday, April 17, 2026
E-PAPER
Homeజాతీయంఇండియా, పాకిస్తాన్‌లా విభజించారు

ఇండియా, పాకిస్తాన్‌లా విభజించారు

- Advertisement -

– తెలంగాణ, ఏపీ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు
– ప్రతిపక్ష ఎంపీల మండిపాటు
– క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు సవరణ బిల్లులపై చర్చలో భాగంగా రాష్ట్ర విభజనను తప్పుబట్టేలా విమర్శలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చారు. ” బ్రిటీషర్స్‌ కంటే చెత్తగా తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ విభజించింది. ఆనాడు ఇండియా-పాకిస్తాన్‌ విభజన మాదిరిగా తెలంగాణ, ఏపీని విభజించారు. విభజన సమయంలో కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరుతో ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది’ అని ఆయన విమర్శించారు. అలాగే డీలిమిటేషన్‌పై ప్రతి పక్షాలు దక్షిణాది రాష్ట్రాల ప్రజలను తప్పదారి పట్టిస్తున్నాయని తేజస్వీ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్‌, తదితర బిల్లులను ఎలాగైనా అడ్డు కోవాలని, ప్రతిపక్షాలు కొత్తదారులు వెతుకుతు న్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్‌ ఫార్ములాపై తేజస్వీ సభలో ప్రస్తావిం చారు. ఆ ప్రతిపాదనను ఆయన కొట్టిపారేశారు. సీట్ల సంఖ్య ఆధారంగా జీడీపీకి ముడిపెట్టాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సలహా అత్యంత తెలివి తక్కువైనదని అన్నారు. అలాంటి ప్రతిపాదనతో ముందుకెళితే ఒక వ్యక్తి, ఒక ఓటు అన్న రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రానికి విలువే ఉండదన్నారు. రాష్ట్రాల ఆదాయం ఏటా మారుతూ ఉంటుందని, దానిని డీలిమిటేషన్‌ ప్రతిపాదికన తీసుకోవడం సరికాదని చెప్పారు. ఆదాయం ప్రకారం ఓట్లు ఇవ్వాలని అనుకుంటే.. దేశంలో అత్యంత ఆదాయనం ఉన్న అంబానీ లక్ష ఓట్లు ఇవ్వాల్సి వస్తుందని సెటైర్లు వేశారు.

తేజస్వీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఫైర్‌
తేజస్వీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు. పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీలు తేజస్వీకి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుపై తేజస్వీ వ్యాఖ్యలు… మరోసారి బీజేపీ పార్టీ అక్కసు బయటపెట్టాయని మండిపడ్డారు. అసలు సంబంధమే లేని అంశంలో తెలంగాణ విభజనను తీసుకురావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రధాని మోడీ, అమిత్‌ షా ప్రోద్బలంతోనే తేజస్వీ ఇలాంటి వ్యాఖ్యలకు సిద్ధపడ్డారన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఏర్పాటును పార్టీ ఎంపీ వక్రీకరిస్తోన్నా… రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీతో పాటు తేజస్వీ సూర్య, రాష్ట్రానికి చెందిన మంత్రులు, బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అత్యధికంగా మాట్లాడింది తేజస్వీనే
రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చలో బీజేపి తరపున…. అందరికంటే ఎక్కువగా సమయం తీసుకొని తేజస్వీ సూర్య మాట్లాడారు. ప్రధాని మోడీ , కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను మించి మాట్లాడారు. ఈ బిల్లుపై ప్రధాని మోడీ 36: 49 నిమిషాలు మాట్లాడితే… అమిత్‌ షా 13:50 నిమిషాలు ప్రసంగించారు. అలాగే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రియాంక గాంధీ (21:35 నిమిషాలు), గౌరవ్‌ గొగొయి (24:36 నిమిషాలు), అఖిలేష్‌ యాదవ్‌ (21:41 నిమిషాలు), అరవింద్‌ సావంత్‌ (24.31 నిమిషాలు), మిగితా సభ్యులు ఇంతకన్నా ముందే తమ ప్రసంగాన్ని ముగించారు. ఇక ఈ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ 24:56 నిమిషాలు తీసుకున్నారు. అయితే తేజస్వీ సూర్య మాత్రం 46:30 నిమిషాలు ఈ సవరణ బిల్లుపై మాట్లాడారు. ఇందులో తెలంగాణ ఏర్పాటును తప్పుబడుతూ, కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌గా చేస్తూ చేసిన వ్యాఖ్యలకే ఎక్కువ సమయం కేటాయించారు. ఇదంతా చూస్తుంటే… ప్రధాని మోడీ, అమిత్‌ షా, ఇతర నేతల డైరెక్షన్‌లోనే తేజస్వీ సూర్య తెలంగాణను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -