– సెల్ఫీలతో హడావిడి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం పర్యాటక కేంద్రం ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుండి సాయంత్రం వరకు పర్యాటకులు వేలాదిగా తరలివచ్చి లక్నవరం పర్యాటక కేంద్రంలో అందాలను వీక్షించారు. రామప్ప మేడారం సందర్శించిన పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో లక్నవరం పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. బోటు షికారు, స్పీడ్ బోటు, వేలాడే వంతెనపై నడుస్తూ సెల్ఫీలు దిగుతూ ఆహ్లాదకరంగా కాలక్షేపం చేశారు. హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు లక్నవరం పర్యాటక కేంద్రాన్ని సందర్శించినట్టు మేనేజర్ శంకర్ తెలిపారు. వరుసగా సెలవులు ఉండటం వల్ల పర్యాటకుల సంఖ్య పెరిగిందని పెరిగిన పర్యాటకులకు తగినట్టుగా సదుపాయాల ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్లు కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయాయి. చిన్నపిల్లలు, వృద్ధులు పేషెంట్లు ఉన్నందున భోజన సదుపాయం లేకపోవడంతో ఇబ్బంది పడ్డామని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుసాపురంలో భోజనం చేయాల్సి వస్తోందని పర్యాటకులు తెలిపారు. వెంటనే క్యాంటీన్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.