విగ్రహం సమానత్వం,సామాజిక న్యాయానికి ప్రతీక
శ్రమశక్తి అవార్డు గ్రహీత డాక్టర్ చిలుకు స్వామి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని శ్రమశక్తి అవార్డు గ్రహీత డాక్టర్ చిలుకు స్వామి అన్నారు.గుండ్లగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ చిలుకు స్వామి హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ తన జీవితాన్ని సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, మానవ హక్కుల కోసం అంకితం చేశారని తెలిపారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూనే విద్యను ఆయుధంగా చేసుకుని దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ విగ్రహం కేవలం శిల్పం కాదని, సమానత్వం, స్వాభిమానం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నేటి యువత అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. “చదువుకోండి.. సంఘటితంగా ఉండండి.. ఉద్యమించండి” అనే అంబేద్కర్ సందేశం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని అన్నారు. విగ్రహ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేసి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలపాలని ఆకాంక్షించారు.విగ్రహ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న దాతలు, ప్రజాప్రతినిధులు,అధికారులు, గ్రామ పెద్దలు, యువతను డాక్టర్ చిలుకు స్వామి అభినందించారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి మంజుల మహేందర్ రెడ్డి,ఉపసర్పంచ్, వార్డు సభ్యులు,గ్రామ ప్రముఖులు, యువకులు, అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



