జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానీ చంద్ర
నవతెలంగాణ-సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 3వ జాతీయ లోక్ అదాలత్ను సెప్టెంబర్ 12న సంగారెడ్డి జిల్లా కోర్టుతో పాటు జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ జిన్నారం కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జి. భవానీ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ లోక్అదాలత్ ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంకింగ్, ఇతర రాజీ పడదగిన కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. లోక్అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
12 సెప్టెంబర్ 2026న నిర్వహించనున్న 3వ జాతీయ లోక్అదాలత్లో అత్యధిక సంఖ్యలో కేసులను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు సంబంధిత శాఖల అధికారులను కోరారు. పెండింగ్ కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్ దశలో ఉన్న వివాదాలను కూడా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజలు తమ కేసుల పరిష్కారం కోసం సంబంధిత కోర్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ/తాలూకా న్యాయ సేవా కమిటీను సంప్రదించి లోక్అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజీ మార్గమే ఉత్తమ మార్గం – లోక్అదాలత్ ద్వారా త్వరితగతిన న్యాయం” అనే లక్ష్యంతో 3వ జాతీయ లోక్అదాలత్ను విజయవంతం చేయడానికి అన్ని వర్గాలు సహకరించాలని ఆమె కోరారు.



