Friday, September 11, 2026
E-PAPER
Homeఆటలుచాంపియన్‌ ఈస్ట్‌ జోన్

చాంపియన్‌ ఈస్ట్‌ జోన్

- Advertisement -

12 ఏండ్ల తర్వాత దులీప్‌ ట్రోఫీ వశం
ఫైనల్లో సౌత్‌ జోన్‌పై ఎదురులేని పైచేయి

నవతెలంగాణ-చెన్నై : దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్‌ కిషన్‌ మేనియా కొనసాగుతోంది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ను విజేతగా నిలిపి నేరుగా టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు సాధించిన ఇషాన్‌ కిషన్‌.. రెడ్‌బాల్‌ ఫార్మాట్‌లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేశాడు. బ్యాటర్‌గా 270 పరుగుల ద్విశతకానికి తోడు 80 పరుగుల అర్థ సెంచరీ బాదిన ఇసాన్‌ కిషన్‌ ఈస్ట్‌ జోన్‌ను దులీప్‌ ట్రోఫీ చాంపియన్‌గా నిలబెట్టాడు. ఐదు రోజుల పాటు సౌత్‌ జోన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఈస్ట్‌ జోన్‌ 12 ఏండ్ల దులీప్‌ ట్రోఫీని వశం చేసుకుంది. చివరగా చెన్నై చెపాక్ స్టేడియంలోనే దులీప్‌ ట్రోఫీ ముద్దాడిన ఈస్ట్‌ జోన్‌ తాజాగా అక్కడే మరోసారి చాంపియన్‌గా అవతరించింది. తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసిన ఈస్ట్‌ జోన్‌.. రెండో ఇన్నింగ్స్‌ను 388/7 వద్ద డిక్లరేషన్‌ ప్రకటించింది. అప్పటికి ఒక్క సెషన్‌ ఆట మాత్రమే మిగటంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌ జోన్‌.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో దులీప్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఒక్కసారి బ్యాటింగ్‌ చేసిన సౌత్‌ జోన్‌ 336 పరుగులకు ఆలౌటైంది.

ఖురేషి సెంచరీ
జార్ఖండ్‌ ఆల్‌రౌండర్‌ ఖురేషి అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఆఖర్లో అనుకూల్‌ రాయ్‌ (64, 112 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తోడుగా ఖురేషి (116 నాటౌట్‌, 190 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. కుమార్‌ కుశాగ్ర (46) అర్థ సెంచరీ చేజార్చుకోగా.. ఇషాన్‌ కిషన్‌ (80), శిఖర్‌ మోహన్‌ (52) అర్థ సెంచరీలు సాధించారు. ఐదో రోజు ఆటలో రెండు సెషన్ల పాటు బ్యాటింగ్‌ చేసిన ఈస్ట్‌ జోన్‌ ఆధిక్యం భారీగా పెంచుకుంది. సౌత్‌ జోన్‌ బౌలర్లు డీలా పడినా.. ఈస్ట్‌ జోన్‌ పరుగుల వేటలో వెనక్కి తగ్గలేదు. మరో సెషన్‌ ఆట మిగిలి ఉండగా ఈస్ట్‌ జోన్‌ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ ప్రకటించింది. సౌత్‌ జోన్‌ మళ్లీ బ్యాట్‌ పట్టేందుకు క్రీజులోకి రాలేదు. ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించి కరచాలనం చేశారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ఈస్ట్‌ జోన్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇషాన్‌ కిషన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలువగా, తిలక్‌ వర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు అందుకున్నాడు.

సంక్షిప్త స్కోరు వివరాలు
ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌ : 708/10 (ఇషాన్‌ కిషన్‌ 270, కుమార్‌ కుశాగ్ర 101, శిఖర్‌ మోహన్‌ 85, అభిమన్యు 72, త్రిపురణ విజయ్‌ 4/180)
సౌత్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌ : 336/10 (తిలక్‌ వర్మ 99, దేవదత్‌ పడిక్కల్‌ 62, ముకేశ్‌ కుమార్‌ 3/62,మహ్మద్‌ షమి 2/42, శిఖర్‌ మోహన్‌ 2/67)
ఈస్ట్‌ జోన్‌ రెండో ఇన్నింగ్స్‌ : 388/7 డిక్లేర్డ్‌ (మహ్మద్‌ ఖురేషి 116, ఇషాన్‌ కిషన్‌ 80, శిఖర్‌ మోహన్‌ 52, అనుకూల్‌ రాయ్‌ 64, నిదీశ్‌ 2/57)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -