నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్ సూపర్ లీగ్ ను మధ్యలోనే వదిలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు వెళ్లిన శ్రీలంక టీ20 కెప్టెన్ దాసున్ శనకపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడిపై ఏడాది పాటు పీఎస్ఎల్లో ఆడకుండా నిషేధం విధించింది. దీనితో 2027లో జరిగే పీఎస్ఎల్ 12వ సీజన్లో శనక ఆడే అవకాశం లేకుండా పోయింది.
పీఎస్ఎల్ 2026 సీజన్లో లాహోర్ ఖలందర్స్ తరఫున శనక ఆడుతున్నాడు. ఇదే సమయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోని సామ్ కరన్ గాయం కారణంగా తప్పుకోవడంతో, అతడి స్థానంలో రూ.2 కోట్లకు శనకను జట్టులోకి తీసుకుంది. దీంతో శనక పీఎస్ఎల్ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకుని ఐపీఎల్లో చేరాడు. ఇటీవల ఇదే తరహాలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీపై కూడా ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ను వదిలేశాడనే కారణంతో పీసీబీ రెండేళ్ల నిషేధం విధించడం గమనార్హం.



