నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కార్మికుల డిమాండ్లు, వారి సమస్యలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిర్ణయం వెలువడిన వెంటనే కార్యాచరణను ప్రారంభించింది. సచివాలయం (సెక్రటేరియట్) వేదికగా కాసేపట్లో అన్ని ఆర్టీసీ యూనియన్ నాయకులతో ఈ కమిటీ భేటీ కానుంది. కార్మికుల ప్రధాన డిమాండ్లు, జీతభత్యాలు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఇతర పెండింగ్ సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ప్రభుత్వం తీసుకునే మరిన్ని నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్ధతు ప్రకటించాయని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులవుతున్నా.. ఇప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 22 నుంచి తలపెట్టిన సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు.



