Wednesday, April 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం హోదాలో రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు

సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు

- Advertisement -

కేసీఆర్‌ పుణ్యం వల్లే సీఎం అయ్యావ్‌.. జగిత్యాల సభ విజయవంతం:మాజీమంత్రి జీవన్‌రెడ్డి
నవతెలంగాణ – జగిత్యాల

కేసీఆర్‌ పుణ్యం వల్లే సీఎం అయిన రేవంత్‌రెడ్డి.. సీఎం హోదాలో ఉండి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మాజీ సీఎం కేసీఆర్‌ సభను అడ్డుకోవాలని చూసినా విజయవంతం అయిందని చెప్పారు. జగిత్యాల పట్టణంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగళశారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందన్నారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ తెలంగాణను దేశంలో ముందంజలో నిలిపారని తెలిపారు. రైతుబంధు వంటి పథకాలతో రైతులకు మద్దతు ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా, పంట బీమా వంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోయి నెలలు గడిచినా మరమ్మతులు చేపట్టకపోవడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. కేవలం రూ.400 కోట్లతో మరమ్మతులు సాధ్యమని నివేదికలు ఉన్నప్పటికీ ఆలస్యం చేస్తున్నారని అన్నారు. తెలంగాణకు అవసరమైన నీటి వనరుల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టిన కేసీఆర్‌ దూరదృష్టి నాయకుడని చెప్పారు.ప్రజలు పాలన మార్పు కోరుకుంటున్నారని, ‘రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్‌ రావాలి’ అనే భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. తన రాజకీయ ప్రయాణంలో పదవుల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని, ఆత్మగౌరవం కోసం నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులే విద్యాసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ దావా వసంత, నాయకులు లోక బాపురెడ్డి, హరిచరణ్‌రావు, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -