– ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉద్యోగ విరమణ ప్రతి ఉద్యోగికి తప్పనిసరి దశ అయినప్పటికీ, తన సేవా కాలంలో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు అరుదుగా ఉంటారని మండల విద్యాధికారి పి. ప్రసాదరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మే 31 న పదవీ విరమణ పొందుతున్న రామిరెడ్డి ని బుధవారం ఘనంగా సన్మానించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. హరిత అధ్యక్షతన నిర్వహించిన ఉద్యోగ విరమణ సన్మాన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసాదరావు మాట్లాడుతూ, రామిరెడ్డి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఉపాధ్యాయుడిగా, నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని ప్రశంసించారు. తన ఉద్యోగ బాధ్యతలను ఆదర్శవంతంగా నిర్వహించి, గౌరవప్రదంగా ముగించారని అన్నారు.
ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ అలవర్చడంలో రామిరెడ్డి ప్రత్యేక శైలిని అనుసరించారని తెలిపారు. ఉపాధ్యాయుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అనంతరం రామిరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు తమకు ఆయనతో ఉన్న అనుబంధాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



