– పైగా ప్యాలెస్ మరమ్మతుల గణాంకాలు వాస్తవ విరుద్ధమని ప్రకటన
నవతెలంగాణ-సిటీబ్యూరో
హెచ్ఎండీఏ ప్రస్తుత అమీర్పేట్లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ నుంచి బేగంపేట్లోని చారిత్రక ‘పైగా ప్యాలెస్’కు మారుతున్న నేపథ్యంలో బేగంపేటలోని చారిత్రాత్మక ‘పైగా ప్యాలెస్’ మరమ్మతుల కోసం హెచ్ఎండీఏ రూ.93 కోట్లు ఖర్చు చేస్తోందంటూ బుధవారం నవతెలంగాణ దినపత్రికలో ఒక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనంపై హెచ్ఎండీఏ అధికారికంగా స్పందించింది. ఆ వార్తల్లో పేర్కొన్న గణాంకాలు వాస్తవ విరుద్ధమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
నేపథ్యం ఇదీ..
పైగా ప్యాలెస్ను 2007లో అమెరికా కాన్సులేట్ కార్యాలయం కోసం లీజుకు ఇచ్చారు. గతేడాది (ఏప్రిల్ 2023లో) గచ్చిబౌలిలో తమ సొంత భవనం నిర్మించుకున్న తర్వాత కాన్సులేట్ వారు ఈ భవనాన్ని తిరిగి హెచ్ఎండీఏకు అప్పగించారు. కాన్సులేట్ వినియోగంలో ఉన్న సమయంలో భవనంలో పలు మార్పులు చేర్పులు (పార్టిషన్లు, ఏసీ డక్టులు, బుల్లెట్ ప్రూఫ్ తలుపులు వంటివి) చేశారు.
కార్యాలయాల తరలింపు
ప్రస్తుతం నానక్రామ్గూడలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్, బీ.పీ.పీలో ఉన్న హెచ్ఎండీఏ కార్యాలయాలను బేగంపేటలోని పైగా ప్యాలెస్కు తరలించాలని ప్రభుత్వం(జీవో.ఎంఎస్.నెం.46 ద్వారా) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భవనాన్ని కార్యాలయ అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు పనులు చేపట్టారు.
అసలు ఖర్చు వివరాలు..
పత్రికలో ప్రచురించినట్టుగా రూ.93 కోట్లు కాకుండా, వాస్తవానికి అవుతున్న ఖర్చు వివరాలను హెచ్ఎండీఏ వెల్లడించింది. ప్రధాన భవనం అనవసరమైన నిర్మాణాల తొలగింపు, పాత లిఫ్ట్ ఆధునీకరణ, భవన పునరుద్ధరణ కోసం కలిపి మొత్తం రూ.4.84 కోట్లు మాత్రమే వెచ్చించారు. సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా స్థలం సరిపోకపోవడంతో, అనెక్స్-1, అనెక్స్-2 భవనాలపై అదనపు అంతస్తుల నిర్మాణం కోసం రూ.3.76 కోట్లు కేటాయించారు. మొత్తంగా చూస్తే, ప్రధాన భవన పునరుద్ధరణ, అదనపు నిర్మాణాలకు కలిపి అయ్యే ఖర్చు పత్రికలో పేర్కొన్న దానికంటే చాలా తక్కువని అధికారులు తెలిపారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా, వాస్తవాలను పరిశీలించకుండా రూ.93 కోట్లు ఖర్చు చేస్తున్నారని రాయడం సరికాదని హెచ్ఎండీఏ బుధవారం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
నవతెలంగాణ కథనంపై స్పందించిన హెచ్ఎండీఏ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



