చికిత్స పొందుతూ రోగి మృతి
బంగారు ఆభరణాలు మాయం అంటూ బంధువుల ఆరోపణ ?
నవతెలంగాణ – జగిత్యాల టౌన్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో కొడిమ్యాల మండలం నాచుపల్లి కి చెందిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందడం కలకలం రేపింది. మృతి చెందిన రోగి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బంధువుల వివరాల ప్రకారం ఆరోగ్యం విషమించడంతో బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతున్న సమయంలోనే ఆమె మృతి చెందారు. అయితే మృతి అనంతరం ఆమె శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు కనిపించకపోవడం గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తిని వివరణ కోరెందుకు నవ తెలంగాణ చరవాణి ద్వారా సంప్రదించగా ఆయన స్పందించలేకపోయారు. ఇట్టి విషయమై జగిత్యాల టౌన్ సిఐ కరుణాకర్ ను వివరణ కోరగా బాధితులు ఇంటికి వెళ్లిన తర్వాత చూసుకొని ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. విచారణ కొనసాగుతుందని, విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.



