హిందూత్వ సంస్థల ఫిర్యాదు..
ముస్లిం ఐపీఎస్ అధికారిణి బదిలీ
పశ్చిమ బెంగాల్ బీజేపీ సర్కారు నిర్ణయంపై ప్రతిపక్షాల విమర్శలు
కోల్కతా : మతపరమైన అభివాదం చేసినందుకు ఓ ముస్లిం ఐపీఎస్ అధికారిణిపై హిందూత్వ సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆమె బదిలీ కావడం పశ్చిమ బెంగాల్లో తీవ్రర రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. ఇస్లామిక్ పదాలు ఉపయోగించారంటూ హిందూత్వ సంస్థలు ఫిర్యాదు చేసిన రెండు రోజులకే బుషారా బానో బదిలీ కావడం పలు ప్రశ్నలకు తావిచ్చింది. ప్రభుత్వ వర్గాలు ఇది సాధారణ పరిపాలనా బదిలీ అని చెప్తున్నప్పటికీ.. బీజేపీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే చేసిందనే విమర్శలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి.
వీడియోతో మొదలైన వివాదం
సెప్టెంబర్ 13న సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలో బుషారా బానో తన యూపీఎస్సీ పరీక్షా సన్నద్ధత గురించి వివరించారు. యూపీలోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ తనకు ఎలా సహాయపడిందో ఆమె చెప్పారు. వీడియోలో ఆమె ‘అస్సలాముఅలైకుమ్’, ‘ఇన్షా అల్లాహ్’, ‘జజాకల్లాహ్’ వంటి ఇస్లామిక్ అభివాదాలు, పదాలను ఉపయోగించారు. ఈ పదాల వినియోగంపై హిందూత్వ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.బుషారా బానో 2021 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిణి. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 14న జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్లో ఆమెను రాష్ట్ర సాయుధ పోలీసు నాలుగో బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్గా నియమించారు. ఇదే ఉత్తర్వుల్లో మరో ఇద్దరు అధికారులకు కూడా కొత్త బాధ్యతలు అప్పగించారు.
ప్రతిపక్షం తీవ్ర విమర్శలు
వీడియో వివాదం, హిందూత్వ సంస్థల ఫిర్యాదు నేపథ్యంలో బదిలీ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ, ప్రభుత్వ ఉత్తర్వుల్లో బదిలీకి వీడియోను ప్రత్యక్ష కారణంగా పేర్కొనలేదు. అయితే, ఫిర్యాదు అనంతరం స్వల్పకాల వ్యవధిలో బదిలీ జరగడంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్రిక్స్ సదస్సు సందర్భంగా లౌకికతను ప్రదర్శించేందుకు ప్రార్థనా గది ఏర్పాటు చేస్తోందని చెప్పుకుంటూనే, రాష్ట్ర స్థాయిలో ముస్లిం మహిళా ఐపీఎస్ అధికారిణి ఇస్లామిక్ అభివాదాలు ఉపయోగించినందుకు పక్కన పెడుతున్నారని ఆరోపించారు.



