– వక్ఫ్బోర్డు, దేవాదాయ భూములపై సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ శనివారం సచివాలయంలో సమావేశం కానుంది. వక్ఫ్ బోర్డు, దేవాదాయ భూములపై ఆయా శాఖలతో కమిటీ ప్రతినిధులు చర్చించనున్నారు. ఆ రెండు విభాగాలకు రాష్ట్రంలో వేలాది ఎకరాల భూమలున్నాయి. అయితే వీటి సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోక పోవడంతో కాలక్రమంలో వేల ఎకరాల భూమలు అన్యాక్రాంతమయ్యాయి. ఎండోమెంట్, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న భూములు, ఆస్తులను కాపాడటానికి, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సర్వే, సెటిల్మెంట్ విభాగం ద్వారా రికార్డుల నిర్వహణ, భూ భారతి కార్యక్రమం, ల్యాండ్ పార్శిల్ మ్యాప్లు, ధరణి పోర్టల్ కింద తీసుకున్న మ్యాప్ల స్థితిపై ఆరా తీయనున్నారు. ఈ సమవేశంలో సీసీఎల్ కమిషనర్, కమిటీ కన్వినర్ నవీన్ మిట్టల్, సభ్యులు ఎం. కోదండరెడ్డి, రేమండ్ పీటర్, వి. లచ్చిరెడ్డి, సునిల్, మధుసూదన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారు.