– చెర్యాల్లో 120.16 ఎకరాలకు ఎసరు
– రైతుల నుంచి ముందే భూములు కొన్న దళారులు
– ఇండిస్టీయల్ పార్క్ కోసం నోటిఫికేషన్
– 1965లో ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు భూముల పంపిణీ
– ఐఐటీ హైదరాబాద్-ముంబయి హైవే పక్కనే భూములు
– ఎకరం ధర రూ.7 కోట్లపైనే.. 60 ఏండ్లుగా పేదలకు జీవనాధారం
– భూసేకరణను వ్యతిరేకిస్తున్న దళిత, గిరిజన, బీసీ రైతులు
– బలవంతపు భూసేకరణ సరికాదు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పంటలు పండించేది.. పరిశ్రమలు స్థాపించేది ఇలా ఏది చేయాలన్నా భూమ్మీదే. పెరుగుతున్న పట్టణీకరణ ప్రభావంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో దళారులు అసైన్డ్ భూములనూ వదలడం లేదు. అమాయక రైతులను నయానో.. భయానో.. బెదిరించి వారి భూములను లాక్కుంటున్నారు. ఆ తర్వాత అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రభుత్వం నుంచి భూసేకరణ కోసం నోటిఫికేషన్ రాగానే పెద్దమొత్తంలో లబ్ది పొందుతున్నారు. ఐఐటీ హైదరాబాద్ సమీపంలోని ముంబయి హైవే పక్కన భూముల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ఆ ప్రాంతంలోని దళిత, గిరిజన, బీసీ పేదలకు చెందిన అసైన్డ్ భూములపై పెద్దల కన్ను పడింది. ఇండిస్టీయల్ పార్క్ కోసం భూముల్ని లాక్కుంటారని భయపెట్టి అమాయకులైన రైతుల నుంచి ముందే లాగేసుకున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆగమేఘాల మీద భూసేకరణకు పూనుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. జిల్లాలో రెండు జాతీయ రహదారులు హైదరాబాద్-ముంబయి, హైదరాబాద్-నాందేడ్లు విస్తరించి ఉన్నాయి. జాతీయ విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్ కంది మండలంలోనే ఉంది. అనేక మల్టీనేషనల్ కంపెనీలు, స్థానిక పరిశ్రమలూ విస్తరించాయి. దాంతో జిల్లా కేంద్రం కంటే కంది మండల కేంద్రంలోని భూములకే అధిక ధరలు పలుకుతున్నాయి.అందుకే ఈ మండలంలో ఉన్న అసైన్డ్ భూములపై పెద్దల కన్ను పడింది. ఇప్పటికే అనేక గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా అయ్యాయి. తాజాగా చెర్యాల్ గ్రామంలోని దళితులు, గిరిజనులు, బీసీలకు చెందిన 120.16 ఎకరాల అసైన్డ్ భూముల్ని ప్రభుత్వ అవసరాల పేర లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇండిస్టీయల్ పార్క్కు 120 ఎకరాల భూసేకరణ
చెర్యాల్ గ్రామంలోని 741, 741/1 సర్వే నెంబర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 120.16 ఎకరాల అసైన్డ్ భూముల్ని ఇండిస్టీయల్ పార్క్ కోసం సేకరించాలనే ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు గురువారం భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇండిస్టీయల్ పార్క్ కోసం ముందుగా గుమ్మడిదల మండలంలో 120 ఎకరాల అసైన్డ్ భూముల్ని సేకరించాలని చూశారు. దళితులకు చెందిన భూముల్ని పార్క్ కోసం తీసుకుంటున్నామని అధికారులు ప్రకటించడంతో బాధిత రైతులు పెద్దఎత్తున వ్యతిరేకించారు. దీంతో అక్కడ భూసేకరణను ఉపసంహరించుకుని.. కంది మండలంలోని చెర్యాల్ గ్రామంలో ఉన్న విలువైన అసైన్డ్ భూముల్లో ఇండిస్టీయల్ పార్క్ కోసం 120.16 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఆ భూమే పేదలకు జీవనాధారం
చెర్యాల్ గ్రామంలో భూమి లేని నిరుపేదలైన దళిత, గిరి జన, బీసీ కుటుంబాలు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములే జీవ నాధారంగా బతుకుతున్నాయి. చెర్యాల్ గ్రామంలోని 741 సర్వే నెంబర్లో 340 ఎకరాల వరకు ప్రభుత్వ, అసైన్డ్ భూములున్నా యి. 1965 నుంచి 1970 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వాలు గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాల్ని లబ్దిదారులుగా ఎంపి క చేశాయి. ఒక్కొక్కరికి ఎకరం, అరెకరం, రెండెకరాల చొప్పున వంద కుటుంబాలకు 120.16 ఎకరాల్ని అసైన్డ్ చేసి పట్టా సర్టిప ˜ికెట్స్ జారీ చేశాయి. లబ్దిదారులకు భూములను పంపిణీ చేసి హక్కులు కల్పించారు. అప్పటి నుంచి ఆ భూముల్లో పంటలు పండించుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు.
ఇండిస్టీయల్ పార్క్ పేర కాజేసే కుట్ర
ఇండిస్టీయల్ పార్క్ పేరిట విలువైన పేదల భూముల్ని కాజేయాలనే కుట్రలు సాగుతున్నాయి. ఇండిస్టీయల్ పార్క్ పెట్టేందుకు ఎక్కడో శివారు మండలాల్లో భూముల్ని సేకరించాలి. కానీ.. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం, ఐఐటీ హైదరాబాద్ పక్కనే ఉన్న చెర్యాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూముల్నే ఎందుకు సేకరిస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇండిస్టీయల్ పార్క్ పేరిట పేదల భూముల్ని సేకరిస్తారు. ఆ భూముల్ని తెలంగాణ రాష్ట్ర ఇండిస్టీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ)కి బదలాయిస్తారు. తర్వాత టీజీఐఐసీ ఆ భూముల్ని అభివృద్ధి చేసి కంపెనీలకు నామమాత్రపు ధరకు విక్రయిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యమైన నాయకుడికి భూముల్ని కట్టబెట్టేందుకే ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. 741 సర్వే నెంబర్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల భూముల్ని ఇండిస్టీయల్ పార్క్ కోసం ప్రభుత్వం లాక్కుంటుందనీ, ఏమీ ఇవ్వకుండా తీసుకుంటే నష్టపోతారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులను భయపెట్టారు. కొందరు రైతులతో బేరసారాలాడి తక్కువ ధర ఇచ్చేట్టుగా ఒప్పందం చేసుకుని భూముల్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఎకరం ధర రూ.6-7 కోట్లు ఉంది. ప్రభుత్వం నుంచి రూ.60 లక్షల వరకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి రైతుల్ని ఒప్పిస్తున్నారు.
పేదల అసైన్డ్ భూములే టార్గెట్
పరిశ్రమలు, అభివృద్ధి పేరిట ప్రభుత్వం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట రాజకీయ నాయకులు పేదల అసైన్డ్ భూముల్నే టార్గెట్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, డబుల్ బెడ్రూం ఇండ్లంటూ అసైన్డ్ భూముల్ని పైసా పరిహారమివ్వ కుండానే లాగేసుకుంది. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా అదే జరుగుతోంది. న్యాల్కల్ మండలంలోని డప్పూర్, మాడ్గి గ్రామాల్లో ఫార్మాసిటీ పేరిట 2 వేల ఎకరాల భూముల్ని సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో 600 ఎకరా లు అసైన్డ్ భూములే ఉన్నాయి. అక్కడి రైతులు వ్యతిరేకించ డంతో ఆగిపోయింది. గుమ్మడిదల మండలంలో ఇండిస్టీయల్ పార్క్ కోసం 120 ఎకరాల్ని సేకరించేందుకు భూముల్ని గుర్తించారు. అక్కడి రైతులు వ్యతిరేకించడంతో తాజాగా కంది మండలంలో రైతుల్ని ముందే ఒప్పించే పనిలో పడ్డారు.
బలవంతపు భూసేకరణ సరికాదు : ఎం.నర్సింహులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, సంగారెడ్డి
చెర్యాల్ గ్రామంలో పేదల అసైన్డ్ భూముల్ని ఇండిస్టీయల్ పార్క్ కోసం బలవంతంగా సేకరించొద్దు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు భూములే జీవనాధారంగా బతుకుతున్నారు. కంది మండలంలో ఎకరం ధర రూ.ఐదారు కోట్లు ఉంది. భూములు తీసుకుంటే రైతులకు ఏం నష్టపరిహారం ఇస్తారో.. ఇతర బెనిఫిట్స్ ఏమిటో చెప్పకుండా మధ్యవర్తులు భూములు రాయించుకుంటున్నారు. 2013 భూ సేకరణ చట్టంలో ఉన్న సదుపాయాలన్నీ కల్పించాలి.