– చదువు సాగేదెట్టా?..విద్యార్థుల్లో ఆందోళన
– అద్దె బకాయిలు చెల్లించకపోతే
– తాళాలేనంటున్న యజమానులు
– ప్రత్యామ్నాయాల కోసం ప్రభుత్వం వెతుకులాట
– గురుకులాలపై రాజకీయ దుమారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూన్ వచ్చింది. బడికి వేళయింది. విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఈ ఏడాదైనా అక్కడ సౌకర్యాలు మెరుగవుతా యా? ఎప్పటిలాగానే ఆ సమస్యలతో సహవాసం చేయాల్సిందేనా? విద్యార్థుల మెదళ్లను తొలుస్తు న్న ప్రశ్నలివి. గత ప్రభుత్వం గురుకులాల సంఖ్య, వాటి స్థాయి పెంచింది. సౌకర్యాలు కల్పించటంలో మాత్రం విఫలమైంది. ఫలితంగా అవస్థల మధ్యే విద్యాబోధన సాగింది. దీంతో విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకులాల్లో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించేందుకు పూనుకోలేదు. అవే అద్దె భవనాల్లో వాటిని కొనసాగించింది. తద్వారా గడిచిన విద్యా సంవత్సరం విద్యార్థులు సమస్యలతో సతమతమ య్యారు. కలుషిత ఆహారం, తాగునీరు, తగినన్ని బాత్రూమ్లు లేకపోవటం వంటి తదితర అనేక సమస్యలతో కొందరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డ విషయం తెలిసిందే.
మెరుగుపడని సౌకర్యాలు
ఆర్థిక స్థోమత లేని పేదలెందరో తమ కన్న బిడ్డల భవిష్యత్తు కోసం ప్రభుత్వ విద్యనే ఆధారమని భావించి సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తారు. ఉచిత విద్య, వసతి, భోజనం అందిస్తూ పేద విద్యార్థుల విద్యా వికాసానికి తోడ్పాటును, బాలబాలికలకు కార్పొరేట్ స్థాయి విద్యనూ అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందుకనుగుణంగా రెసిడెన్షియల్ పాఠశాలలను తీర్చిదిద్దటంలో మాత్రం సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదనేది వాస్తవం. గురుకులాల్లో అన్నంలో పురుగులు, ఆహారం కల్తీ, ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల అస్వస్థత, హాస్టల్లోకి వన్యప్రాణులు రావటం, మూత్రశాలలు, స్నానాల గదులులేక అవస్థలు.. ఇలా అనేక వార్తలు నిత్యం ప్రచురితమవుతున్న విషయం తెలిసిందే. వీటిని మెరుగు పర్చటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అద్దె భవనాలే దిక్కా?
మొత్తం గురుకులాల్లో సగానికి పైగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నిజానికి వేసవి సెలవుల్లో దాదాపు నెలన్నరపాటు వాటిని మూసి ఉంచినా.. తిరిగి తెరిచే నాటికి చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ పని జరగటం లేదు. పెచ్చులూడి పోవడం, చుట్టూ ప్రహరీ లేకపోవడంతో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల సంక్షేమంపై దష్టిపెట్టాలి!
గత ప్రభుత్వం తన పదేండ్ల పాలనలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ చూపలేదు. సంఖ్యను పెంచటం, ఉన్నవాటిని అప్గ్రేడ్ చేయటం మినహా వాటిల్లో సౌకర్యాలు కల్పించటం, తగిన నిధులు కేటాయించి, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచి, సొంత భవనాలు నిర్మించలేదు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ సమస్యలన్నింటికీ కారణమంటూ రాజకీయ విమర్శలు చేస్తోందంటూ గురుకుల విద్యా సంస్థల అధికారులు చెప్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా విద్యాశాఖ చూస్తున్న సందర్భంగా సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. కానీ, ఆ వైపుగా అడుగులు పడటం లేదనే విమర్శలు లేకపోలేదు.
అద్దె బకాయిలు చెల్లించటంలో నిర్లక్ష్యం..
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలు మూతపడే పరిస్థితి కనిపిస్తున్నది. అద్దె బకాయిలు చెల్లించాలని ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదనీ, అందుకే వాటికి తాళాలేస్తామని ఇప్పటికే కొందరు యజమానులు ప్రకటించారు. కొన్ని చోట్ల ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకోసం అన్వేషిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.
సమస్యలతో కుస్తీ..
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ సమస్యలు రావడానికి ప్రధాన కారణం నాణ్యమైన సరుకులు వాడకపోవటమే. ఇటీవల కాలంలో ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచినప్పటికీ వాటిని వినియోగించటంలో లోపాలున్నాయనే విమర్శలున్నాయి. మెనూ ప్రకారం భోజనం ఉంటుంది కానీ.. వండే వంటలకు సంబంధించి కొన్ని నాసిరకం వస్తువుల వినియోగిస్తున్నారు. కూరగాయలు కుళ్లిపోయి రావడం జరుగుతోంది. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గదుల్లో ఫ్యాన్లు, సరిపడా లైట్లు కూడా లేవు. అనేక చోట్ల తాగునీటి శుద్ధి యంత్రాలు లేకపోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఉన్నా.. అవి పనిచేయడం లేదు. స్నానం చేసేందుకు వేడినీరు అందించే వాటర్ హీటర్లు కూడా అందుబాటులో లేవు. విరిగిన కిటికీలు, పగిలిన తలుపులు, చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో నిండిన పరిసరాలు, పాములు, తేళ్లు, విష పురుగులు, అపరిశుభ్రంగా మారిన టాయిలెట్లతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆసౌకర్యాలతో నిండిన ఆ రెసిడెన్షియల్లో చదువు సాగటం ఎలా? అనేది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న.