కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
మంత్రులకు శాఖల కేటాయింపుపైనే ప్రధాన చర్చ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఢిల్లీలో హైకమాండ్ సమాలోచనలు చేస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గంలో పలువురి శాఖల మార్పు, ప్రస్తుతం సీఎం దగ్గర ఉన్న పలు కీలక శాఖలను ఇతరులకు ఇచ్చే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇందులో భాగంగా హుటాహుటిన హస్తిన పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా భవన్లో పార్టీ జనరల్ సెక్రెటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీలో మంత్రులకు శాఖల కేటాయింపుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కొత్తగా మంత్రివర్గంలో స్థానం కల్పించిన గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు ఏఏ శాఖలు కేటాయించాలి? అనే అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. అదే విధంగా ప్రస్తుతం మంత్రుల దగ్గర ఉన్న శాఖలు, 18 నెలలుగా వారి సమర్థత, ఆయా శాఖలో ప్రభుత్వ పనితీరు, విమర్శలు…సీఎంతో పాటు, పలువురు మంత్రుల దగ్గర ఒకటికి మించి ఉన్న శాఖలను కేసీకి సీఎం రేవంత్రెడ్డి వివరించినట్టు తెలిసింది. ఈ లిస్టును కేసీ వేణుగోపాల్కు సీఎం రేవంత్ రెడ్డి సమర్పించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా హౌం, ఎడ్యుకేషన్, మున్సిపల్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, లా, లేబర్, స్మోర్ట్స్, యువజన శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. వీటిలో కొత్త వారికి పలు శాఖలు అప్పగించడంతో పాటూ… పాత మంత్రుల శాఖలోనూ మార్పులు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. ఇదే ఫైనల్గా మారితే… డిప్యూటీ సీఎం మొదలు.. కీలక మంత్రుల శాఖలోనూ మార్పులు ఉండవచ్చని చెబుతున్నారు….నూతనంగా మంత్రి బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్కు లేబర్, మైనింగ్, స్పోర్ట్స్ శాఖలు ఇవ్వనున్నట్టు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే వాకిటి శ్రీహరికి లా, యూత్, పశుసంవర్థక శాఖలు లేదా మత్స్య శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. వీటితో పాటు మంత్రి పదవి ఆశించి భంగపడిన వారి వివరాలతో పాటు, వారిని శాంతింపజేసే అంశాలపై కూడా కేసీతో సీఎం మాట్లాడినట్టు తెలిసింది. అలాగే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్తో పాటు, కార్పోరేషన్లపై ఫోకస్ పెట్టాలని సీఎంకు సూచించినట్టు తెలిసింది. బీఆర్ఎస్లో అంతర్గత లొల్లి, బీజేపీ-బీఆర్ఎస్ల మధ్య రహస్య ఒప్పందాలను ఎండగడుతూ… ప్రస్తుతం పార్టీని మరింత బలోపేతం చేయాలని కేసీ సూచించినట్టు సమాచారం.
ఏం చేద్దాం..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES