– బెంగాల్ పర్యటనలో తెరపైకి అభిప్రాయబేధాలు
– గోయల్ రాజీనామాపై చర్చోపచర్చలు
– నేరుగా రాష్ట్రపతికి రాజీనామా లేఖ
– సీఈసీతో విభేదాలే కారణం?
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)లో రచ్చ చర్చనీయాంశంగా మారింది.ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి ఆకస్మికంగా, అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు పశ్చిమ బెంగాల్లో పర్యటించినప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్తో నెలకొన్న విభేదాల కారణంగానే గోయల్ రాజీనామా చేశారని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఏమిటా విభేదాలు..? ఎన్నికల ముందు ఎందుకీ రచ్చ..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ : బెంగాల్లో ఎన్నికల ఏర్పాట్లను వివరించేందుకు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొనడానికి గోయల్ నిరాకరించారని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సీఈసీ ఒక్కరే పాత్రికేయులతో సమావేశమయ్యారు. ఆరోగ్య కారణాలతో గోయల్ ఢిల్లీకి పయనమయ్యారని ఆయన ఆ సందర్భంగా చెప్పారు. అయితే ఈ వాదనను గోయల్ సన్నిహిత వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన ఆరోగ్యం భేషుగ్గా ఉన్నదని చెప్పాయి. ‘కొన్ని తీవ్రమైన విభేదాల కారణంగానే గోయల్ తన బెంగాల్ పర్యటనను కుదించుకొని ఢిల్లీ చేరుకున్నారు’ అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇంతకీ ఏం జరిగింది..?
ఈసీఐలోని ఈ ఇద్దరు అధికారుల మధ్య ఏం జరిగింది? ఆ విభేదాలు ఏమిటి? ఏయే అంశాలపై అభిప్రాయబేధాలు తలెత్తాయి? అనే విషయాలు తెలియడం లేదు. గోయల్ సన్నిహిత వర్గాలు కానీ, ఈసీ వర్గాలు కానీ దీనిపై పెదవి విప్పడం లేదు. ఈ నెల 7న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సమావేశాలకు సీఈసీతో పాటు గోయల్ కూడా హాజరయ్యారు. కానీ ఆ మరునాడు ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ అధికారులు, కేంద్ర హోం కార్యదర్శి అజరు కుమార్ భల్లా మధ్య జరిగిన సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. పైగా సీఈసీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపారు.
గోయల్కు నచ్చచెప్పేందుకు, సీఈసీతో ఆయనకు ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వైపు నుండి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆయన తన పట్టు వీడలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గోయల్ రాజీనామాను రాష్ట్రపతి శనివారం నాడు ఆమోదించారు. దీనికి సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ వెలువడే వరకూ సీఈసీకి, ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు తప్ప గోయల్ రాజీనామా గురించి ఎవరికీ తెలియదు. గోయల్ ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటారని అధికారులు చెబుతున్నారు. గోయల్ రాజీనామా ఈసీ స్వతంత్రతపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోందని వారు అంటున్నారు. ఎన్నికల కమిషనర్గా నియామకం కావడానికి ముందు ఆయన ప్రభుత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మరో ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే పదవీకాలం గత నెలలోనే ముగిసినందున ఇప్పుడు కమిషన్లో ఒక్క రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు. కాగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.