– అహ్మదాబాద్లో 8500కుపైగా కుటుంబాల ధీనస్థితి
– సరైన పత్రాలున్నా.. పట్టించుకోని అధికారులు
– రోడ్డున పడిన వేలాది మంది ప్రజలు
– మండే వేసవిలో ఇబ్బందుల పాల్జేసిన గుజరాత్ సర్కారు
– ప్రభుత్వ చర్య సరికాదు
– ఒక వర్గంవారే టార్గెట్
– మేధావులు, సామాజిక కార్యకర్తలు, న్యాయ నిపుణుల ఆందోళన
– వేలాది ఇండ్లు నేల మట్టం
గాంధీనగర్: గుజరాత్లో అక్రమ వలసదారుల పేరిట జరిగిన తరలింపు ప్రక్రియ ఆందోళన కలిగిస్తున్నది. ఎలాంటి చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా.. కేవలం ఒక వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకొనే జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇది వేలాది కుటుంబాలను తీవ్ర ఇబ్బందుల పాల్జేసింది. అహ్మదాబాద్లోని చందోలా సరస్సు ప్రాంతంలో బాధిత కుటుంబాలు తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నాయి. సామాజిక కార్యకర్తలు, న్యాయ నిపుణులు, మేధావులు సైతం గుజరాత్ సర్కారు చర్యను తప్పుబడుతున్నారు. అన్ని పత్రాలున్నా.. కేవలం ఒక వర్గం వారు అన్న కారణంతోనే ఇలాంటి ద్వేషపూరిత చర్యకు దిగిందని ఆరోపిస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన సల్మా.. అహ్మదాబాద్లోని చందోలా సరస్సు ప్రాంతంలో ఒకప్పుడున్న తన ఇంటి వద్ద నిలుచొని తన బాధను వ్యక్తం చేసింది. ”మాకు నిద్రించటానికి స్వచ్ఛమైన ప్రదేశం, శుభ్రమైన నీరు లేవు. మా పిల్లలు విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో వారు స్కూల్కు వెళ్లటం లేదు” అని ఆమె తెలిపింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత మొదలైన డ్రైవ్
ఇటీవల భారత్లో అతిపెద్ద తరలింపు ప్రక్రియలో భాగంగా అహ్మదాబాద్లో అధికారులు 10వేలకు పైగా తాత్కాలిక, శాశ్వత గృహాలను కూల్చివేశారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఇది జరిగిందని అధికారులు నివేదించారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ డ్రైవ్ జరిగింది. చందోలాలలోని దాదాపు 1000 మంది నివాసితులను అక్రమ బంగ్లాదేశీయులుగా ముద్రవేసి.. మండే ఎండలో లాల్ దర్వాజా పోలీస్ స్టేషన్కు, అంటే ఆరు కిలోమీటర్లు వారిని అధికారులు నడిపించినట్టు సమాచారం. వారిని నేరస్తుల్లాగా చేతులు పైకెత్తి కవాతు చేయించారు. కొంత మందికి చెప్పులు కూడా వేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఆ తర్వాత వారిని ఏడ్రోజుల పాటు కస్టడీలో ఉంచారు. చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించినప్పటికీ.. వారిలో 200 మందిని బంగ్లాదేశ్ జాతీయులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇక మిగిలిన 800 మంది తిరిగి తమ నివాస ప్రాంతానికి వెళ్లగా.. అప్పటికే తమ ఇండ్లు కూలిపోయిన బాధాకర దృశ్యాన్ని వారు గమనించారు. ఉండటానికి ఇల్లు.. చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోవటంతో ఆ ఎండాకాలంలో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చందోలాలో జరిగిన ఈ ప్రక్రియలో ఒక ద్వేషపూరితమైన చర్య, అస్థిరత, పారదర్శకతలేమి కనిపిస్తున్నదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. కూల్చి వేతకు సంబంధించి అధికారిక యంత్రాంగం నుంచి చాలా మందికి ముంద స్తు నోటీసులు అంద లేదని బాధిత కుటుంబా లు చెప్తున్నాయి. వీరిలో ఎక్కువ మంది యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లిం వలస కార్మికులే. అయితే, వీరి దగ్గర సరైన, చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నప్పటికీ.. అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. వారిని అక్రమ బంగ్లాదేశ్ వలసదారులుగా ముద్రవేసి, వారిని సామూహికంగా అక్కడి నుంచి తరలించారు.
అన్ని పత్రాలున్నా.. ఇల్లును కూలగొట్టారు
ఏప్రిల్ 26న పోలీసు సిబ్బంది చందోలా సరస్సు సమీపంలోని బెంగాలీ వాస్ ప్రాంతంలోకి ప్రవేశించారు. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) నివేదిక ప్రకారం.. 457 మంది పురుషులు, 219 మంది మహిళలు, 214 మంది పిల్లలు.. మొత్తం 890 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కంకారియా ఫుట్బాల్ గ్రౌండ్కు తీసుకెళ్లి చాలా గంటలు బయటే కూర్చోబెట్టారు. ఆధార్, ఓటర్ వంటి గుర్తింపుకార్డులు, ఇతర పత్రాలున్నా.. అవి నకిలీవని అధికారులు కొట్టివేశారు. అదుపులో ఉన్నవారిలో చాలామంది బీహార్, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్కు చెందిన భారతీయులే కావటం గమనార్హం. ”మా దగ్గర రేషన్ కార్డులు, స్కూల్ సర్టిఫికెట్లు, జనన ధృవీకరణ పత్రాలు వంటి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నా పిల్లలు ఇక్కడే పుట్టారు. అయినప్పటికీ.. మమ్మల్ని బయటకు నెట్టేశారు. మేము లోపల ఉండగానే వారు మా ఇంటిని ధ్వంసం చేశారు” అని సల్మా అనే ఒక స్కూల్ టీచర్ తన ఆవేదనను వెలిబుచ్చారు.
చట్టపరంగా ప్రక్రియను చేపట్టని అధికారులు
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ప్రకారం.. ఏప్రిల్, మే మధ్య చందోలా సరస్సు ప్రాంతంలో పది వేలకు పైగా అక్రమ నిర్మాణాలుగా చెప్పబడే ఇండ్లు తొలగించబడ్డాయి. అయితే, ఈ ప్రక్రియకు సంబంధించి చట్టపరంగా పాటించాల్సిన ప్రక్రియను అధికారిక యంత్రాంగం అనుసరించలేదనీ, ఒక పథకం ప్రకారం, ఒక వర్గం ఉంటున్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవటమే వారి చర్యల్లో కనిపించిందని సామాజిక కార్యకర్తలు చెప్తున్నారు. ”వాళ్లు(అధికారులు, పోలీసు సిబ్బంది) ఉదయం 6 గంటలకు వచ్చారు. 10 గంటలకల్లా అంతా అయిపోయింది. వస్తువులన్నీ బుల్డోజర్ల కింద నలిగిపోయాయి. ‘మనం ఎప్పుడు ఇంటికి వెళ్తున్నాం’ అని నా కూతురు అడుగుతోంది. కానీ, ఇప్పుడు ఇల్లు కూడా లేదు” అని గృహ కార్మికు డు రుఖ్సర్ వాపోయాడు.
‘సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించరా?’
గుజరాత్ ప్రభుత్వం మాత్రం తన చర్యను సమ ర్థించుకున్నది. ఈ ప్రక్రియ ను సాధారణ ఆక్రమణ తొల గింపుగా కాకుండా.. ఉగ్రవాద వ్యతిరేక చర్యగా ఆ రాష్ట్ర హౌం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి అభివర్ణించారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రజా భద్రత సమస్యలను ఉటంకిస్తూ ఈ విధంగా చెప్పటం గమనార్హం. ” ఇది సామూహిక శిక్ష. పోలీసు వ్యాన్లు బుల్డోజర్లతో వచ్చాయి. ఇక్కడి కుటుంబాలను నిందితులుగా చేర్చారు. ఓటరు కార్డులు, విద్యుత్ బిల్లులు, ఆధార్ వంటివి ఉన్నా.. అవేవీ పట్టించుకోలేదు” అని సామాజిక కార్యకర్త ఫిరోజ్ షాలిమ్ అన్నారు. గుజరాత్ సర్కారు చర్యను న్యాయ నిపుణులు సైతం తప్పుబడుతున్నారు.
”అనధికారిక నిర్మాణాల విషయంలో కూడా సహేతుకమైన నోటీసు ఇవ్వకుండా నివాసాలను కూల్చలేరు. అలాంటి కేసులలో కనీసం 15 రోజుల నోటీసు తప్పనిసరని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ప్రస్తుత కేసులో నాలుగు గంటల సమయం మాత్రమే ఇచ్చారు” అని సుప్రీంకోర్టు న్యాయవాది మెహమూద్ ప్రాచా తెలిపారు. ఇలాంటి కూల్చివేతలు తరచుగా రాజకీయ, వాణిజ్య ఉద్దేశాలతో జరుగుతాయ న్నారు. ఈ ఇండ్లు నిజంగా చట్టవిరుద్ధమైతే.. అవి దశాబ్ద కాలంగా యుటిలిటీ కనెక్షన్లు, రేషన్కార్డులు, పన్ను రశీదులతో ఎందుకున్నాయని ప్రశ్నించారు.