– సమాజానికి పనికొచ్చే సమాచారాన్ని రాబట్టాలి : చర్చా గోష్టిలో ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమాజానికి పనికొచ్చే ప్రశ్నలడగడం ద్వారా ఆర్టీఐ చట్టాన్ని కాపాడుకోవాలని కేంద్ర మాజీ సమాచార కమిషనర్ ఫ్రోఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు అన్నారు. సిటిజన్స్ ఫోరం (హెచ్సీఎఫ్), పీపుల్స్ ఫ్రంట్ ఫర్ రైట్ టూ ఇన్ఫర్మేషన్ (పీఎఫ్ఆర్ఐ) సంయుక్తంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ”ఆర్టీఐ చట్టం అమలు తీరు.. పొంచి ఉన్న ప్రమాదాలు” అనే అంశంపై ఆదివారం చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది అధికారులు ప్రశ్న రూపంలో అడిగితే సమాచారం ఇవ్వడం లేదనీ, సమాచారం రాబట్టడం ప్రధానం తప్ప ఏ రూపంలో అడిగారు అనేది ప్రధానం కాదని అన్నారు. అలాంటి వారికి ప్రశ్న రూపంలో కాకుండా కావలసిన సమాచారాన్ని రాబట్టే పద్ధతిలో అడిగి సమాచారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలోనే అతి గొప్ప సమాచార హక్కు చట్టం మనదేశంలో ఉన్నదనీ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదని గుర్తు చేశారు. ఆర్టీఐ నిపుణులు శ్రీనివాస్ మాదవ్ మాట్లాడుతూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 (డీపీడీపీ) పేరిట కేంద్రం తీసుకొచ్చిన చట్టం వల్ల ఆర్టీఐ చట్టం లక్ష్యం దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తుల గోప్యత పేరిట సామాజిక సమాచారాన్ని కూడా అధికారులు దాటవేసే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే ప్రజాస్వామ్యం బతుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. దురదృష్ట వశాత్తు నేటి యువతలో అది సన్నగిల్లిందని అన్నారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. పార్థసారథి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రమాదంలో ఉన్నదనీ, దాన్ని కాపాడుకోవటం కోసం ప్రజా సంఘాలు, సంస్థలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య, పీఎఫ్ఆర్ఐ అధ్యక్షులు యాదయ్య అధ్యక్షత వహించారు.
ఆర్టీఐ చట్టాన్ని కాపాడుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES