Tuesday, June 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆదివాసీ గుడిసెలపై ఫారెస్ట్‌ అధికారుల దాడులు

ఆదివాసీ గుడిసెలపై ఫారెస్ట్‌ అధికారుల దాడులు

- Advertisement -

– జేసీబీ డోజర్లతో కూల్చివేతకు యత్నం
– ప్రతిఘటించిన గిరిజనులు
– పరిస్థితి ఉద్రిక్తం
– ములుగు జిల్లాలో ఘటన
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ

వారంతా ఇండ్ల స్థలాలు లేని ఆదివాసీ గిరిజనులు.. రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో గుడిసెలు వేసుకొని ఏడాది కాలంగా నివాసముంటూ.. ఆ కాలనీకి కొమురం భీమ్‌గా నామకరణం చేసుకున్నారు. అయితే, ఉన్నట్టుండి వారి గుడిసెలపై సోమవారం ఫారెస్టు అధికారులు దాడులు చేశారు. జేసీబీలు, డోజర్లతో గుడిసెలను కూల్చేస్తుండగా.. గిరిజనులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. రోహిరు ఫారెస్ట్‌ అటవీ శాఖ పరిధి చల్పాక వెళ్లేదారిలో ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన పదేండ్ల కిందట గొత్తికోయలు నివాసాలు ఏర్పాటు చేసుకొని కొంతకాలంపాటు జీవించారు. అనంతరం ఫారెస్ట్‌ అధికారుల దాడులతో గుడిసెలను ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే, ఇండ్ల స్థలాలు లేని గిరిజనులు కొందరు అక్కడ సంవత్సర కాలంగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. ఆ గూడానికి ‘కొమురం భీమ్‌’ పేరు పెట్టుకున్నారు. దీంతో వారిని అక్కడి నుంచి పంపించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫారెస్టు అధికారులు సోమవారం జేసీబీ డోజర్లతో వారి గూడెంపైకి దాడికి దిగారు. గుడిసెలను కూల్చేస్తుండగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. ప్రతిఘటించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అటవీశాఖ అధికారులు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు అటు అధికారులకు, ఇటు గిరిజనులను సర్దిచెప్పారు. తమ గుడిసెలపై దాడిని ఆపకుంటే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఇండ్లు లేని నిరుపేద గిరిజనుల గుడిసెలపై ఫారెస్ట్‌ అధికారులు వాహనాలతో రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి సీతక్క స్పందించాలి : గిరిజన నాయకుడు నీలాద్రి
గిరిజనుల పట్ల మంత్రి సీతక్క కపట ప్రేమ చూపిస్తున్నారు. స్థానికులైన మేము కేవలం ఒకట్రెండు గుంటల స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే ఇలా దాడులు చేయించడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికైనా మంత్రులు సీతక్క, కొండా సురేఖ స్పందించి గిరిజనులపై ఫారెస్ట్‌ అధికారుల దాడులు నిలిపివేయాలి. మాకు పక్కా ఇండ్లు మంజూరు చేయాలి.
ప్రాణాలతో బయటపడ్డాం : అటవీశాఖ నార్త్‌ రేంజ్‌ అధికారి అప్సర్‌ ఉన్నిస
ఎలాంటి అనుమతులూ లేకుండా అటవీ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ఉంటున్న ఆదివాసీ గిరిజనులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి స్థలం ఖాళీ చేపించే ప్రయత్నం చేశాం.
కానీ, వారు ఒక్కసారిగా మాపై కర్రలు, కారం, ఇతర ఆయుధాలతో ఎదురు తిరిగారు. మేము తీసుకెళ్లిన వాహనాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. వాహనాల డ్రైవర్లకు గాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వారి సహాయంతో మేము ప్రాణాలతో బయటపడ్డాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -