Tuesday, June 17, 2025
E-PAPER
Homeజాతీయంఏ వైపు ఉండాలి…!?

ఏ వైపు ఉండాలి…!?

- Advertisement -

– ఇరాన్‌-ఇజ్రాయిల్‌ ఘర్షణపై భారత్‌ సందిగ్థత
– రెండు దేశాలతోనూ సత్సంబంధాలు
– చమురు అవసరాలు తీరుస్తున్న టెహరాన్‌
– టెల్‌ అవీవ్‌తో రక్షణ బంధం
– దౌత్యంలో తప్పని సవాళ్లు
న్యూఢిల్లీ:
గత రెండు సంవత్సరాల కాలంలో పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలలో ఇరాన్‌-ఇజ్రాయిల్‌ మధ్య జరుగుతున్న తాజా ఘర్షణలు అత్యంత ముఖ్యమైనవని చెప్పవచ్చు. ఈ ఘర్షణలు భారత దౌత్య ప్రతిస్పందనకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఎందుకంటే మన దేశానికి ఈ ప్రాంతంతో వివిధ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ సమీకరణలతో ముడిపడి ఉన్న విభిన్న వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే భారత్‌ దౌత్యపరమైన ప్రతిస్పందన తెలియజేసే విషయంలో మల్లగుల్లాలు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇరాన్‌-ఇజ్రాయిల్‌ మధ్య జరుగుతున్న ఘర్షణలను తేలికగా తీసుకోవడానికి వీలు లేదు. ఇరాన్‌ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్‌ దాడులు చేస్తోంది. ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అమెరికా నేతృత్వంలో చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.
ఇజ్రాయిల్‌తో రక్షణ భాగస్వామ్యం
గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌కు ఇజ్రాయిల్‌ రక్షణ భాగస్వామిగా ఉంటోంది. మన భద్రత, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునీకరించుకోవడంలో నూ, ఉగ్రవాద వ్యతిరేక చర్యలలోనూ ఇజ్రాయిల్‌ సహకారం ఉంది. 1992 నుండీ ఇజ్రాయిల్‌తో భారత్‌ దౌత్య సంబంధాలు కొనసాగి స్తోంది. రెండు దేశాలు పరస్పర అవగాహనతో వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ అవగాహనకు సుదీర్ఘ చరిత్రే ఉంది. 1948లో యూదు రాజ్యం ఏర్పడినప్పటి నుండీ అది కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో ఇజ్రాయిల్‌తో బహిరంగంగా లేక రహస్యంగా సంబంధాలను ఏర్పరచుకోవడానికి మన ప్రభుత్వ ం ప్రపంచ దేశాలతో సహా ఈ ప్రాంతంలోని ఇతర భాగస్వాములతో ప్రయోజనాల విషయంలో సమతుల్యతను పాటిస్తూ వస్తోంది.
ఐరాస తీర్మానానికి దూరం
ఉదాహరణకు గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ఐక్యరాజ్యసమితి చేసిన తాజా తీర్మానాన్నే తీసుకుందాం. తీర్మానంపై ఓటింగ్‌ జరిగినప్పుడు దానికి దూరంగా ఉండాలని భారత్‌ నిర్ణయించుకుంది. ఇలా ఇజ్రాయిల్‌ దుశ్చర్యలపై ఐరాస తీర్మానాన్ని ప్రతిపాదించిన ప్రతి సందర్భంలోనూ భారత్‌ ఓటింగుకు గైర్హాజరు అవుతోంది. గత మూడు సంవత్సరాల కాలంలో ఇలా జరగడం ఇది నాలుగోసారి. 2024 డిసెంబరులో మాత్రం తక్షణ కాల్పుల విరమణ తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది. అన్ని సందర్భాలలోనూ భారత్‌ దౌత్యపరంగా ఒకే మాట చెబుతూ వస్తోంది. ఘర్షణకు స్వస్తి చెప్పాలని, మానవతా సాయాన్ని అడ్డుకోవద్దని. అమెరికా కూడా ఓటింగుకు దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఐరాస తీర్మానాలు హమాస్‌ను విమర్శించడం లేదని దాని వాదన. ఐరాస సమావేశాలు మంగళవారం ప్రారంభమ వుతున్న నేపథ్యంలో భారత్‌ తన ప్రతినిధులను పంపుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
ముడి చమురు అవసరాల కోసం…
భారత్‌ తన ముడి చమురు అవసరాలు తీర్చుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. గత దశాబ్ద కాలంగా ఇరాన్‌ చాలా వరకూ ఈ అవసరాలను తీరుస్తున్న విషయం తెలిసిందే. 2018కి ముందు భారత్‌ తన ముడి చమురు అవసరాలలో పదో వంతును ఇరాన్‌ నుండే పొందింది. అయితే గత ఐదు సంవత్సరాలుగా ఇరాన్‌ నుండి దిగుమతులు తగ్గించుకుంటోంది. ఇరాన్‌ చమురు దిగుమతిదారులలో చైనా మొదటి స్థానంలో నిలవడమే దీనికి కారణం. ఇరాన్‌తో సంబంధాలను విస్తరించుకోవడం ద్వారా చైనా అనేక వ్యూహాత్మక ప్రయోజనాలు పొందుతోంది. ఇదిలావుండగా ఇప్పుడు మన ఇంధన అవసరాలు పెరుగుతు న్నాయి. కాబట్టి ఇరాన్‌తో చమురు వాణిజ్యాన్ని పెంచుకోవడ ంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇరాన్‌ నుండి చమురు దిగుమతులు పెరిగితే పరస్పర ప్రయోజనాలు నెరవేరతాయి. భారత్‌ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారుగా కొనసాగుతోంది. అటు ఇరాన్‌ కూడా కీలకమైన చమురు కొనుగోలుదారు కోసం అన్వేషిస్తోంది.
ఈ అంశాలు కూడా…
ఇరాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునే విషయంలో ముడి చమురు దిగుమతులే కాకుండా ఇతర భౌగోళిక, వ్యూహాత్మక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. మధ్య ఆసియాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలంటే చాబహార్‌ ఓడరేవు కీలకంగా మారుతుంది. ఈ ఓడరేవులో పెట్టుబడులు పెట్టాలని భారత్‌ భావిస్తోంది. దీనివల్ల భారత్‌ వాణిజ్యానికి పాకిస్తాన్‌ మార్గపు అవరోధాలు కూడా తొలగిపోతాయి. అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ కారిడార్‌ అభివృద్ధిపై కూడా భారత్‌ దృష్టి సారిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులు భారత్‌, ఇరాన్‌ దేశాల ప్రయోజనాలకు కేంద్రంగా ఉంటాయి. పశ్చిమ దేశాలు తనపై విధించిన ఆంక్షలను ఎదుర్కోవాలంటే ఈ కారిడార్‌ ఇరాన్‌కు ఎంతో అవసరం. ఇరాన్‌, ఇజ్రాయిల్‌…ఈ రెండు దేశాలకూ భారత్‌ భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యత ఇస్తోంది. దానిని దృష్టిలో ఉంచుకునే ఇజ్రాయిల్‌-ఇరాన్‌ ఘర్షణల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది.

ఇరాన్‌తో సంబంధాలపై దృష్టి
దక్షిణాసియాలో ఇరాన్‌ ఓ కీలక శక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రష్యా, చైనా దానికి మిత్రదేశాలుగా కొనసాగుతున్నాయి. ఇరాన్‌ నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతి అవుతోంది. అమెరికా ఆంక్షల కారణంగా దిగుమతులు కొంతమేర తగ్గినప్పటికీ నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి భారత్‌కు ఇరాన్‌ వ్యూహాత్మక ప్రాధాన్యత ఇస్తోంది. ఇరాన్‌తో సంబంధాలను పునర్నిర్మించు కోవాలని ఇటీవలి కాలంలో భారత్‌ యోచిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ టెహరాన్‌లో పర్యటించి వచ్చారు. ఇరాన్‌తో సంబంధాలను తిరిగి ఏర్పాటు చేసుకోవాలన్న భారత్‌ ఉద్దేశం వెనుక ఓ కారణం ఉంది. ఇరాన్‌ నుంచి చమరు దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను భారత్‌ గతంలో సమర్ధించింది. ఆ నిర్ణయం కారణంగా పడే ప్రభావం నుంచి బయటపడాలని ఇప్పుడు ప్రయత్నిస్తోంది. దక్షిణాసియాలోని శక్తివంతమైన దేశాలతో సంబంధాలు నెలకొల్పుకొని తన ప్రయోజనాలను విస్తరించుకోవాలని భారత్‌ కోరుకుంటోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -