– ఇప్పటి వరకూ మనం చేసిందెంత..? చేయాల్సిందెంత..?
– ప్రతీనెలా నివేదికలివ్వండి
– వాటిపై సమీక్ష చేద్దాం.. పనితీరు మెరుగుపరుచుకుందాం… : మంత్రులతో భేటీలో సీఎం రేవంత్రెడ్డి దిశా నిర్దేశం
– ‘స్థానికం’పై లోతైన చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా దృష్టి సారించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటిదాకా ఏయే శాఖల పనితీరెలా ఉందనే విషయమై ఆయన ఆయా మంత్రులతో సమాలోచనలు జరిపారు. ఒక్కో శాఖలో ఇప్పటి వరకూ చేసిన పనులేంటి? చెయ్యని పనులేంటి? ఇంకా చెయ్యాల్సిన అంశాలేమిటి..? అనే అంశాలను ముఖ్యమంత్రి… మంత్రులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో సీఎం… అందుబాటులో ఉన్న మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రుల పనితీరు, సంబంధం లేని శాఖల గురించి మాట్లాడటం, డిపార్టుమెంట్ల వారీగా ఇప్పటిదాకా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వాటి అమలు, ఫలితాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తాజాగా ఇదే అంశంపై మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు తదితరాలు ఈ సమావేశంలో చర్చకొచ్చినట్టు తెలిసింది.
ఇక నుంచి శాఖల వారీగా ప్రతీనెలా నివేదికలివ్వాలంటూ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రులను ఆదేశించినట్టు తెలిసింది. ఆయా రిపోర్టులపై తాను వ్యక్తిగతంగా సమీక్ష చేస్తానంటూ సీఎం తెలిపారు. దాంతోపాటు ఏ శాఖకు ఆ శాఖకు విడిగానూ, అన్ని శాఖలపై ఉమ్మడిగానూ సమీక్షిద్దామంటూ సూచించారు. బలాలు, సానుకూలాంశాలతోపాటు బలహీనతలు, లోపాలుంటే వాటిపై కూడా చర్చించాలంటూ ముఖ్యమంత్రి కోరారు. తద్వారా పనితీరును మరింత మెరుగుపరుచుకునేందుకు వీలు కలుగుతుందని సూచించారు. ఇటీవలే మంత్రివర్గ విస్తరణ చేపట్టిన నేపథ్యంలో సీనియర్లు… జూనియర్ల(కొత్త వారికి)కు దిశానిర్దేశం చేయాలంటూ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటంతోపాటు ప్రతిపక్షాల విమర్శలను అటు అసెంబ్లీలోనూ, ఇటు బయటా తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం శాఖల వారీగా తాజా సమాచారంతో సిద్ధంగా ఉండాలంటూ రేవంత్… మంత్రులకు సూచించారు. మరోవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా వ్యూహాలు రచించాలంటూ సీఎం… మంత్రులను కోరారు. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, ఏ మండలానికి ఆ మండలం వారీగా గెలుపు వ్యూహాలు రూపొందించాలని సూచించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ తదితరాంశాలు స్థానిక సమరంలో కీలకమవుతాయని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం ఈ విషయంలో చేసిన కృషిని రైతులకు విడమరిచి చెప్పాలని ఆదేశించారు. దీంతోపాటు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు, దానిపై పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేయటం, మంత్రి సీతక్క స్పందించటం తదితరాంశాలపై సీఎం, అమాత్యులతో మాట్లాడినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన పొంగులేటిని సున్నితంగా మందలించినట్టు వినికిడి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ ముఖ్యమంత్రి, మంత్రులకు సూచించారు. ‘ఎవరి శాఖలకు సంబంధించి వారే మాట్లాడండి, ఒకరి శాఖలో మరొకరి జోక్యం వద్దు, విధానపరమైన నిర్ణయాల విషయంలో ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారు మాట్లాడొద్దు…’ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గతంలో చేసిన హెచ్చరికను ఈ సందర్భంగా సీఎం మరోసారి గుర్తు చేశారు.
ఏ శాఖ పనితీరెలా ఉంది..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES