Tuesday, June 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణి ఓసీ-త్రీ పనులు నిలిపివేత

సింగరేణి ఓసీ-త్రీ పనులు నిలిపివేత

- Advertisement -

– రూ.4కోట్లు పెండింగ్‌ !?
– డబ్బులు ఇచ్చి పనులు ప్రారంభించాలని కార్మికుల వేడుకోలు
నవతెలంగాణ-గణపురం

జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరశురాంపల్లి గ్రామంలో సింగరేణి ఓసీ-త్రీ నిర్లక్ష్యం వల్ల ఎస్‌విఈసీ కంపెనీ సోమవారం పనులు నిలిపివేసింది. సదరు కంపెనీకి దాదాపు రూ.4కోట్లు బకాయిలు ఉండగా బిల్లులు సకాలంలో చెల్లించనందుకు పనులు నిలిపివేసినట్టు ప్రతినిధులు తెలిపారు. దీంతో కంపెనీ డ్రైవర్స్‌, ఆపరేటర్స్‌ ఇతర కార్మికులు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. పరశురాంపల్లి గ్రామంలో సింగరేణి ఓసీ-త్రీ ప్రారంభం నుంచి ఎస్‌వీఈసీ కంపెనీకి పనులు అప్పగించారు. దీంతో ఆ కంపెనీ ఇతర కార్మికులను తీసుకొచ్చి పనులు చేయిస్తోంది. దాదాపు అన్ని విభాగాల్లో కలిపి 600మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి నెలా ఒకటి నుంచి 5వ తేదీ వరకు జీతాలు చెల్లించాల్సి ఉండగా.. 15వ తేదీ దాటినా ఇప్పటివరకు జీతాలు చెల్లించలేదు. కార్మికులకు మార్చిలో చెల్లించాల్సి బోనస్‌ ఇంకా ఇవ్వలేదు. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మిక అవసరాలు దృష్టిలో పెట్టుకొని పనులు నిలిపివేసినట్టు కంపెనీ ప్రతినిధులు తెలపడం గమనార్హం. కాగా, తాము రెండ్రోజుల్లో ధర్నాలు చేస్తామని నిర్ణయించుకున్నామని, అంతకుముందే కంపెనీనే ముందస్తుగా పనులు నిలిపివేసిందని కార్మికులు వాపోయారు. ఇప్పటికైనా సింగరేణి సంస్థ సకాలంలో డబ్బులు ఇచ్చి పనులు ప్రారంభించాలని కార్మికులు కోరుతున్నారు.
బోనస్‌ ఇప్పటివరకు ఇవ్వలేదు
కనకయ్య, ఓసీ-త్రీ వాల్వో ట్రక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు

ఓసీ-త్రీలో కార్మికులకు రావాల్సిన మార్చి బోనస్‌ ఇప్పటివరకు ఇవ్వలేదు. దాదాపు 600మంది కార్మికులం పనిచేస్తున్నాం. నెల నెలా రావాల్సిన జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సింగరేణి సంస్థ త్వరగా బిల్లులు చెల్లిస్తే 10వ తేదీ లోపు కంపనీ జీతాలు చెల్లిస్తుంది. కంపెనీ పని నిలిపివేయడం వల్ల కార్మికులు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది.
కార్మికులకు నష్టం చేస్తే ఊరుకోం..
కార్మికులకు నష్టం చేస్తే ఊరుకోం..

బందు సాయిలు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు
సింగరేణి ఓసీ-త్రీలో ఎస్‌వీఈసీ కంపనీ పనులు నిలిపివేయడం బాధాకరం. కార్మికులను రోడ్డున పడేస్తే సహించేది లేదు. కంపెనీకి రావాల్సిన డబ్బులను సింగరేణి సంస్థ వెంటనే విడుదల చేయాలి. సింగరేణి సంస్థ సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్లే కంపెనీ కార్మికులకు జీతాలు అందించడం లేదు. జీతాలే కాక మార్చిలో చెల్లించాల్సిన బోనస్‌ ఇప్పటివరకు ఇవ్వకపోవడం సరికాదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -