నవతెలంగాణ – ఆర్మూర్: జిల్లా స్థాయిలో 2024 -2025 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రాఫిట్ షూ కంపెనీ కంపెని సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా సత్కరించారు. అనంతరం వారికి ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మెరిసిన ఈ విద్యాకుసుమాలు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆదర్శం అని అన్నారు. విద్య ద్వారానే సమాజ స్థితిని, గతిని మార్చవచ్చని తెలిపారు. పేదరికం అభివృద్ధికి అడ్డు కాకూడదు అని, కష్టపడి చదివి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. నేడు ఉన్న స్థితిలో ఉన్న వారందరూ ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తు చేశారు. అలాగే ఇలాంటి బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన ప్రాఫిట్ షూ కంపెని అధినేత శ్రీ బి.ఎస్ కోటేశ్వరరావు అందరికీ ఆదర్శం అని తెలిపారు.