నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై అనుసరించాల్సిన తదుపరి వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం రేపు సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ కీలక భేటీకి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్లను గౌరవ అతిథులుగా ఆహ్వానించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఆహ్వానాలు పంపామని, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల ఎంపీలకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి సమావేశానికి రావాల్సిందిగా కోరినట్లు ఆయన వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “ట్రైబ్యునల్ తీర్పులకు, చట్టాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చేపట్టాలని చూస్తోంది. ఈ విషయంపై మేము ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి మా అభ్యంతరాలను తెలియజేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను కూడా కేంద్రానికి లేఖలు రాశాం. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కూడా కలిసి ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజల నీటి హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వివరించాం” అని తెలిపారు.