– ఫస్ట్ నైపుణ్య అభివృద్ధి కేంద్రం, సెట్విన్ ద్వారా మహిళలకు శిక్షణా కార్యక్రమాలు
– రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక : పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ -మహబూబ్నగర్
మహిళలు ఆర్థికంగా మరింతగా అభివృద్ధి చెందాలని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిన ఆయనకు మంగళవారం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో మహబూబ్నగర్ ఫస్ట్ నైపుణ్య అభివృద్ధి కేంద్రం, సెట్విన్ ద్వారా వివిధ స్వల్ప కాల కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్నగర్ ఫస్ట్ కార్యక్రమం కింద సెట్విన్ ద్వారా మహిళలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆలోచనతో స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. యువజన శాఖ పరిధిలో ఉన్న సెట్విన్ ద్వారా మహిళలకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమాలను పైలెట్గా తీసుకొని ఉమ్మడి పాలమూరు జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్టు తెలిపారు. స్త్రీ శక్తితోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. నారాయణపేట జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహించే ముఖ్యమంత్రి పెట్రోల్ బంక్ను ప్రారంభించామన్నారు.
ప్రతి జిల్లాలో పెట్రోల్ బంక్లు మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంలో పదో తరగతి పిల్లలకు ప్రత్యేకంగా రూపొందించిన 3డీ యానిమేటెడ్ పుస్తకాల పంపిణీని మార్గదర్శకంగా తీసుకుని మక్తల్ నియోజకవర్గంలోనూ 3718 మంది విద్యార్థులకు అందజేసినట్టు తెలిపారు. దీంతో ఉత్తీర్ణత 100 శాతం పెరగడం గమనార్హం అన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో చేపట్టిన 3డీ యానిమేషన్ మెటీరియల్ వచ్చే సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తామని సీఎం చెప్పినట్టు తెలిపారు. మక్తల్ నియోజకవర్గం అమరచింతలో 200 మంది మహిళలు డ్రెస్ మెటీరియల్ డిజైన్, తయారీ ఆర్డర్ చేసి ప్రతి నెలా రూ.12 వేల నుంచి 14 వేల వరకు సంపాదిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, రాష్ట్ర మైనార్టీ ఆర్థిక సంస్థ చైర్మెన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, గిరిధర్రెడ్డి, మల్లు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.