– మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
– రైౖతాంగ స్ఫూర్తితో పౌరహక్కుల కోసం ఢిల్లీలో పోరాడుతాం
– ఆకలి, దోపిడీ, అసమానతలు లేకుండా అమిత్షా చేయగలరా? : హైదరాబాద్లో శాంతి చర్చల కమిటీ మహాధర్నాలో వక్తలు
– జీవించే హక్కును హరిస్తే సహించం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో మావోయిస్టులే లక్ష్యంగా కొనసాగుతున్న హత్యాకాండను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్షణమే ఆపాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పౌర హక్కులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాల్పుల విరమణను ప్రకటించాలనీ, మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాట స్ఫూర్తితో పౌరహక్కులు, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఢిల్లీలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వినతులు, విజ్ఞప్తులతో కేంద్రం దిగిరాదనీ, బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పారు. ఇండియా కూటమిలోని పార్టీలను ఆహ్వానించి నిర్వ హించాలని కోరారు. దేశంలో పేదరికం, అంతరాలు, ఆర్థిక అసమానతలు ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నాను నిర్వహించారు. శాంతి చర్చల కమిటీ అధ్యక్షులు జస్టిస్ బి చంద్రకుమార్, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ జి హరగోపాల్, కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.
కేంద్రం అంతం చేయాల్సింది పేదరికాన్నే : తమ్మినేని
ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టులపై కేంద్రం సాగిస్తున్న యుద్ధంగా భావిస్తే పొరపాటని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. మనిషి జీవించే హక్కును, ప్రశ్నించేతత్వాన్ని, ప్రశ్నించే గొంతుకను లేకుండా చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నదని విమర్శించారు. మావోయిస్టులు కాబట్టి చంపేస్తున్నదనీ అనుకుంటే పొరపాటనీ, కాల్బుర్గీ, గౌరీలంకేశ్ మావోయిస్టులా?, వారినెందుకు చంపారని ప్రశ్నించారు. ప్రజాతంత్ర శక్తులు, ప్రశ్నించే వారిని అణచివేస్తున్నదనీ, బీజేపీ రక్తంలోనే అది ఉన్నదని వివరించారు. మావోయి స్టుల సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూడకుండా రాజకీయ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం అంతం చేయాల్సింది మావోయిస్టులను కాదనీ, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, పేదరికాన్ని, రాజ్యాహంకారాన్ని అని సూచించారు. రాజకీయ చిత్తశుద్ధితో పాలకులు ప్రయత్నించాలని కోరారు. పేదరికాన్ని నిర్మూలిస్తే కమ్యూనిస్టులుండబోరని అన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరనీ, తుపాకులను చూపించి ఉద్యమాలను అణచలేరని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా సైద్ధాంతిక యుద్ధం జరగాలని అన్నారు. హిట్లర్, ముస్సోలిని సిద్ధాంతం ప్రత్యర్థులను చంపడమేననీ, దాన్నే మోడీ, షా అనుసరిస్తున్నారని చెప్పారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం వల్ల ప్రజలు నల్లధనం, ఉద్యోగాలు, నిరుద్యోగం, అధిక ధరల గురించి మరిచిపోతున్నారని వివరించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులను నిర్మూలించాలంటూ గోల్వాల్కర్ చెప్పా రని గుర్తుచేశారు. ఆ తప్పుడు సిద్ధాంతాన్ని నిర్మూలిం చాలని అన్నారు. రైతాంగం స్ఫూర్తితో మావోయిస్టులపై దమనకాండకు వ్యతిరేకంగా పౌరహక్కులను కాపాడుకు నేందుకు ఢిల్లీలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఉగ్రవాదులు లేకుండా చేస్తే సెల్యూట్ చేస్తాం : కూనంనేని
దేశంలో ఉగ్రవాదులు, నిరుద్యోగం, రైతులకు బాధల్లేకుండా చేస్తే కేంద్ర ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కానీ ప్రజల కోసం పోరాడు తున్న మావోయిస్టులను లేకుండా చేస్తామనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వారిని శిక్షించడానికి చట్టాలున్నాయనీ, న్యాయస్థానా లున్నాయని గుర్తుచేశారు. ఇంకా 11 మంది మావోయిస్టులన్నారనీ, వారిని చంపితే నక్సలిజం ఉండబోదంటున్నారని చెప్పారు. హిట్లర్, ముస్సోలిని లాంటి వారే కమ్యూనిస్టులను ఏం చేయలేక పోయారనీ, మోడీ, షా ఏం చేస్తారని అడిగారు. ప్రశ్నించే తత్వాన్ని, తిరుగుబాటును అణచివేయలేరని అన్నారు. మోడీకి భారత్కు బాస్, ఆయనకు ట్రంప్ బిగ్బాస్ అని చెప్పారు. ట్రంప్ చెప్పడం వల్లే పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపారని చెప్పారు. ఒక్క ఉగ్రవాదినైనా పట్టుకున్నారా? అని ప్రశ్నించారు. భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఎర్రజెండాలన్నీ ఒక్కటి కావాలని ఆకాంక్షించారు. అందరం ఒక్కటైతే ఎర్రకోట కమ్యూనిస్టులది అవుతుందని చెప్పారు. హైదరాబాద్లో జరిగినట్టుగానే ఢిల్లీలోనూ ఈ వాణి వినిపించాలని అన్నారు. కార్పొరేట్ వ్యవస్థకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షా కాపలాకుక్కలని విమర్శించారు. వెట్టిచాకిరీ ఆధునిక రూపంలో అమలవుతున్నదని చెప్పారు.
మావోయిస్టుల సమాధులను చూసినా పాలకులకు భయమే : కె నారాయణ
నక్సలైట్లను చూస్తే కాదు వారి సమాధులను చూసినా పాలకులు భయపడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. మావోయిస్టుల ముక్తి భారత్ కాదనీ, త్వరలోనే అమిత్ షా ముక్తి భారత్ వచ్చి తీరుతుందని చెప్పారు. దరిద్య్రం ముక్తి అని ప్రకటించాలని కోరారు. ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించడానికి ప్రజా ఉద్యమం రావాలన్నారు. నక్సలైట్లు, ఉగ్రవాదులు వేరని అన్నారు.
నక్సలైట్లపై దాడి మానవత్వానికి మచ్చ : దాసోజు శ్రవణ్
కేంద్రం చేపట్టింది ఆపరేషన్ కగార్ కాదనీ, ఆపరేషన్ కార్పొరేట్ల కబ్జా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ విమర్శించారు. మోడీ ప్రభుత్వం నక్సలైట్లపై చేస్తున్న దాడి మానవత్వానికి మాయని మచ్చ అని చెప్పారు. ఏ మనిషినీ, మరే వ్యక్తి చంపే హక్కును రాజ్యాంగం అనుమతించబోదని అన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. ప్రశ్న నుంచి పుట్టిందే నక్సలిజమనీ, వారితో వెంటనే శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇదేం రామరాజ్యం..మీరేం హిందూవులు : ఆర్ నారాయణమూర్తి
‘ఇదేం రామ రాజ్యం..మీరేం హిందూవులు. మీకు యుద్ధనీతి ఎక్కడుంది. రాముడి గురించి గొప్పగా చెబుతారు కదా. యుద్ధంలో రావణాసురుడు అలసిపోతే ”నీవు అలసి పోయావు కాబట్టి ఇప్పుడు నీతో యుద్ధం చేయలేను. తర్వాత చేస్తాను” అని రాముడు అన్న ఆదర్శవంతమైన మాటలు మీకు గుర్తులేవా? మహాభారతంలో యుద్ధం వద్దని కౌరవులతో స్వయంగా శ్రీకృష్ణుడు రాయభారం పంపిన సంగతి మీకు తెల్వదా? హిందూమతంలో చనిపోయిన మృతదేహానికి కర్మకాండలు నిర్వహించడం ఒక క్రతువు కదా..మరి నంబాల కేశవరావు, ఇతర మావోయిస్టుల భౌతికకాయాలను దహన సంస్కారాల కోసం ఇవ్వాలంటూ బంధుమిత్రులు అడిగినా మీకు పట్టదా? గొప్ప హిందూవులమని చెప్పుకునే మీరు వారి ఆదర్శాలను, మత క్రతువులను ఎందుకు పట్టించుకోరు?’ ఇదేం రామరాజ్యం అంటూ’అని సినీనటుడు ఆర్ నారాయణమూర్తి విమర్శించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాల తీరును తప్పుపట్టారు. అణచివేసే కొద్దీ ఉద్యమాలు తీవ్రమవుతాయని హెచ్చరించారు. దోపిడీ ఉన్నంత కాలం పోరాటాలు పుట్టుకొస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. దోపిడీ, అణచివేత, అసమానతల్లేకుండా చేయాలని చెప్పారు.
ఆదివాసీలతో చర్చలు జరపండి : కె నాగేశ్వర్
మావోయిస్టులు తుపాకులు కలిగి ఉన్నారనే కారణంతో చర్చలు జరపడానికి ఇష్టం లేకుంటే ఆదివాసీలతో జరపాలని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు కె నాగేశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులతోపాటు ఆదివాసీలను చంపడం సరైంది కాదని చెప్పారు. రాజ్యాంగం ద్వారా చర్చలు జరిపి ఆదివాసీ ప్రాంతాల్లో నెలకొన్న అల్లకల్లోలాన్ని ఆపాలని కోరారు. సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర నాయకులు కెజి రామచందర్, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్రాజా, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఎస్యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మురహరి, సీపీఐ(ఎంఎల్) రెడ్ఫ్లాగ్ ఆర్మీ నాయకులు డి రాజేశ్, సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, తుడుం దెబ్బ నాయులు నగేశ్, మూవ్మెంట్ ఫర్ పీస్ నాయులు అబ్దుల్ అజీజ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు విమలక్క, పౌరహక్కుల సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, మల్లు లక్ష్మి, సీనియర్ నాయకులు డిజి నరసింహారావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి, పశ్యపద్మ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కాంగ్రెస్ ఎంపీ అనిల్కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు ఇందిరా శోభన్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రియాజ్ తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం : ఎంపీ మల్లు రవి
ఏ సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదమేర్ప డిందని ఆవేదన వ్యక్తం చేశారు. నక్సలైట్లు చర్చలకు సిద్ధమంటూ ప్రకటిస్తే ప్రభుత్వం దాన్ని స్వాగతించాలని అన్నారు. కానీ వారిని నిర్మూలిం చటం ద్వారా సమస్య పరిష్కారం కాదని చెప్పారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాలువ సుజాత మాట్లాడుతూ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టేందుకే మోడీ ప్రభుత్వం గిరిజనులను, నక్సలైట్లను అత్యంత కిరాతకంగా కాల్చిచంపుతున్నదని విమర్శిం చారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైందన్నారు.
ప్రజాస్వామ్య విలువలకు భిన్నంగా కేంద్రం వ్యవహారం : కోదండరామ్
చట్టాన్ని పక్కన పెట్టి, ప్రజాస్వామ్య విలువలకు భిన్నంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించటం తగదని టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అత్యంత దుర్మార్గంగా మావోయిస్టులను చంపుతున్నదని చెప్పారు. ఈ పేరుతో ఆదివాసీలపై మారణహోమాన్ని సృష్టించటం తగదని చెప్పారు.