Wednesday, June 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసహాయ పరికరాల దరఖాస్తు గడువు పొడిగించాలి

సహాయ పరికరాల దరఖాస్తు గడువు పొడిగించాలి

- Advertisement -

– నాణ్యత కలిగిన పరికరాలు ఇవ్వాలి: ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య డిమాండ్‌
– డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా.. వినతిపత్రం అందజేత
– దరఖాస్తు గడువు పెంచుతాం..: డైరెక్టర్‌ హామీ
నవతెలంగాణ-సిటీబ్యూరో

వికలాంగులు సహాయ పరికరాలు పొందేందుకు దరఖాస్తు గడువు ఈనెల 30వరకు పొడిగించాలని, నాణ్యత కలిగిన పరికరాలు పంపిణీ చేయాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ మలక్‌పేట్‌లోని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రతినిధుల బృందం డైరెక్టర్‌కు వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సహాయ పరికరాలు పంపిణీ చేయడానికి రూ.35 కోట్లు విడుదల చేసిందన్నారు. అయితే, దరఖాస్తు గడువు 11 రోజులు మాత్రమే ఎలా పెడతారని ప్రశ్నించారు. కులం, ఆదాయం సర్టిఫికెట్స్‌ జత చేయాలనే నిబంధన వల్ల తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. తహసీల్దార్‌ నుంచి సర్టిఫికెట్‌ పొందాలంటే కనీసం 15 రోజుల సమయం పడుతుందనే విషయం అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ మాత్రమే తీసుకోవాలని, అన్‌ఎంప్లాయి సర్టిఫికెట్‌ నిబంధన తీసేయాలని డిమాండ్‌ చేశారు. సకలాంగులకు అమలవుతున్న పథకాలకు లేని నిబంధనలు వికలాంగులకు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. నాణ్యత కలిగిన పరికరాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతంలో పంపిణీ చేసిన మోటారైస్డ్‌ వెహికిల్స్‌, వీల్‌చైర్స్‌కు సర్వీస్‌ సౌకర్యం లేకపోవడం వల్ల నిరుపయోగంగా మారుతున్నాయన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో వికలాంగులు మీ సేవా కార్యాలయల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. చదువుతో సంబంధం లేకుండా 40 శాతం వైకల్యం ఉన్న వాళ్లందరికీ మోటారైస్డ్‌ వాహనాలు మంజూరు చేస్తామని చెప్పిన అధికారులు.. దరఖాస్తు చేయడానికి మీ సేవా కేంద్రాలకు వెళ్తే అఫిడవిట్‌ జత చేయాలని నిబంధన పెట్టడం మోసం చేయడమే అవుతుందన్నారు. ఈనెల 30వరకు దరఖాస్తుకు గడువు పొడిగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి జెర్కొని రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శశికళ, కె.చంద్రమోహన్‌, ఎ.భుజంగా రెడ్డి, జె.మల్లేష్‌, యాదయ్య, నాయకులు శివ, ఉషా, రమేష్‌, లావణ్య, లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తు గడువు పొడిగిస్తాం: డైరెక్టర్‌ శైలజ
వికలాంగులకు పంపిణీ చేస్తున్న సహాయ పరికరాల దరఖాస్తు గడువు పొడిగిస్తామని వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బి.శైలజ హామీ ఇచ్చారు. నిరుద్యోగ వికలాంగులు దరఖాస్తుకు అన్‌ఎంప్లాయి సర్టిఫికెట్‌ అవసరం లేదని, అఫిడవిట్‌ మాత్రమే జత చేయాలన్నారు. దరఖాస్తు గడువు పొడిగింపుతోపాటు ఎడిట్‌ ఆప్షన్‌ ఇస్తామని, అవసరమైన సవరణలు చేసుకోవచ్చన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -