– ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ నాయకత్వం హస్తం
– మా ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి : ఎంపీ అనిల్కుమార్, గద్వాల్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరితల వాంగ్మూలం
– సిట్ ఎదుట టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ సాక్ష్యం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన 650 మందికి పైగా నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం సిట్ ఎదుట హాజరై, వాంగ్మూలమిచ్చారు. రాష్ట్రంలో జరిగిన మూడు ఉప ఎన్నికలు మొదలుకొని సాధారణ ఎన్నికల వరకు తనతో పాటు కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసి, రాజకీయ లబ్ది పొందా లని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహా రచన చేసి అమలు చేసిందని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న జూబ్లిహిల్స్ స్పెషల్ టీం అధికారుల ఎదుట మహేశ్కుమార్ గౌడ్ ఫోన్ట్యాపింగ్కు సంబంధించి విపులంగా వివరాలను అందజేశారు. 2023, నవంబర్లో దాదాపు 15 రోజులపాటు వరుసబెట్టి తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని ఆయన వివరించారు. ఈ ఫోన్ట్యాపింగ్ల వ్యవహారం వెనుక బీఆర్ఎస్ నాయకత్వం హస్తమున్నదనీ, వారి ఆదేశాల మేరకే ఎస్ఐబీ ఓఎస్డీ ప్రభాకర్రావు, ఇతర పోలీసు అధికారులు నడుచుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తప్ప మరే పార్టీ కూడా రాష్ట్రంలో మనుగడ సాగించకూడదనే కుయుక్తితో ఈ దారుణమైన కుట్రను సాగించారని ఆయన చెప్పారు. 2018లో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఇలాంటి ఫోన్ట్యాపింగ్లనే అమలు చేశారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. అందువల్లే, తాము ఆ ఎన్నికల్లో తాము ఓడిపోయామన్నారు. ఫోన్ట్యాపింగ్ల వ్యవహారంపై కేవలం అధికారులనేగాక.. అప్పటి బీఆర్ఎస్ నాయకుల పాత్రపై కూడా క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి మరోసారి ఎవరు కూడా ఇలాంటి అప్రజాస్వామిక, కుట్రపూరిత వ్యవహారాలను నడపకుండా తగిన బుద్ధి చెప్పేలా దర్యాప్తు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, గద్వాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరితలు కూడా సిట్ ఎదుట హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో తమ ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురయ్యాయని వాంగ్మూలమిచ్చారు. ముఖ్యంగా, పలు సందర్భాల్లో తాము ఇతర నాయకులతో మాట్లాడుకున్న అంశాలను ట్యాపింగ్ చేసి లబ్దిని పొందారని వారు ఆరోపించారు. దీనిపై కూలంకశంగా దర్యాప్తు సాగించి తమకు న్యాయం చేకూర్చాలని కోరారు. ఇదిలా ఉంటే, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు బుధవారం సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సిట్ కోరిన రెండు ఫోన్లు, ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లను కూడా ఆయన వెంట తీసుకొచ్చే అవకాశమున్నదని తెలిసింది. వీటి ఆధారంగా ప్రభాకర్రావును తదుపరి విచారణను సిట్ కొనసాగించే అవకాశం ఉన్నది.
నేడు సిట్ ఎదుట హాజరుకానున్న ముగ్గురు బీజేపీ ఎంపీలు
బీజేపీ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్రావు ల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురైనట్టు ఇప్పటికే సిట్ గుర్తించింది. దీనిపై సమాచారమందుకున్న ముగ్గురు బీజేపీ ఎంపీలు తమ తరఫున కూడా సిట్ ఎదుట బుధవారం హాజరై వాంగ్మూలమివ్వనున్నారని సమాచారం. ముఖ్యంగా, రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు మొదలుకొని సాధారణ ఎన్నికల వరకు తమ ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్టు ఇప్పటికే ఈ ముగ్గురు నాయకులు ఆరోపించారు. ముఖ్యంగా, సిట్ ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఈ ముగ్గురు నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయించి, ఆ సమాచారాన్ని ప్రభాకర్రావు తన కిందిస్థాయి అధికారులకు పంపించటం ద్వారా సదరు నాయకులకు ఇబ్బందులను సృష్టించారని సిట్ దర్యాప్తులో బయట పడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బుధవారం సిట్ కార్యాలయంలో ఫోన్ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశమున్నదని సమాచారం.