Thursday, June 19, 2025
E-PAPER
Homeఆటలునాల్గో స్థానంలో శుభ్‌మన్‌

నాల్గో స్థానంలో శుభ్‌మన్‌

- Advertisement -

వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఉద్ఘాటన
నేడు టీమిండియా తుది జట్టు ప్రకటన
లండన్‌:
టీమిండియా నయా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ అభిప్రాయపడ్డాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు సీనియర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ భారాన్ని మోయాల్సిన బాధ్యత శుభ్‌మన్‌పై పడిందని తెలిపాడు. తాను మాత్రం 5వ స్థానంలోనే బ్యాటింగ్‌కు వస్తానని, కానీ 3వ స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదన్నాడు. గతంలో కోహ్లి 4వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 7,564 పరుగులు చేసిన విషయాన్ని పంత్‌ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపాడు. అలాగే ప్లేయింగ్‌ ఎలెవెన్‌ను సెలెక్షన్‌ కమిటీ గురువారం ప్రకటించే ఛాన్స్‌ ఉందని, ఆ తర్వాత ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగుతారనే అంశం స్పష్టమౌతుందన్నాడు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లేకుండా టీమిండియా తొలిసారి విదేశాల్లో టెస్ట్‌ సిరీస్‌కు వెళ్లిందని, దీంతో రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ బాధ్యతలు తమ భుజాలపై వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నాడు. అలాగే ఇంగ్లండ్‌లో మొదటిసారి క్రికెట్‌ ఆడనున్న యశస్వి జైస్వాల్‌, 2017లో చివరిసారిగా టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన కరుణ్‌ నాయర్‌ అదనపు బాధ్యతలను మోయాల్సి ఉంటుంది. ఇక టీమిండియా జట్టు సోమవారం నుంచి లీడ్స్‌లో, ఇంగ్లండ్‌ జట్టు హెడింగ్లీలో శిక్షణ సెషన్‌ నిర్వహిస్తున్నాయి. అయితే గత రెండు దశాబ్దాలుగా భారత్‌ ఇక్కడ పెద్దగా టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడలేదు. ఇదే తొలిసారి. టీమిండియా 37వ టెస్ట్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపికైన విషయం తెలిసిందే. భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య శుక్రవారం నుంచి తొలిటెస్ట్‌ ప్రారంభం కానుంది.
కెప్టెన్‌ శుభ్‌మన్‌ రాణిస్తేనే
ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌తో సారథ్య బాధ్యతలు చేపడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొనింది. అటు కెప్టెన్‌గానూ.. ఇటు బ్యాటర్‌గానూ అతడు ఎలా రాణిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ జట్టు శుభ్‌మన్‌ గిల్‌నే టార్గెట్‌ చేసుకుంటుందని ఆ జట్టు మాజీ ఆటగాడు నిక్‌ నైట్‌ హెచ్చరించాడు. స్వదేశంలో శుభ్‌మన్‌ గిల్‌ బాగానే రాణించినప్పటికీ.. విదేశాల్లో మాత్రం అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. విదేశాల్లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో అతడు 27.53 సగటుతో 716 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. అదే సొంత గడ్డపై 17 మ్యాచ్‌ల్లో 42 సగటుతో 1,177 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ జట్టు శుభ్‌మన్‌ గిల్‌ను లక్ష్యంగా చేసుకుంటుందని నిక్‌ పేర్కొన్నాడు. ”శుభ్‌మన్‌ గిల్‌కు ఇది పెద్ద సిరీస్‌ అవుతుంది. నేను అతడికి పెద్ద అభిమానిని. అండర్‌-19 వరల్డ్‌ కప్‌ నుంచి అతడి ఆటను చూస్తున్నాను. అతడు గొప్ప ప్రదర్శన చేస్తాడని అప్పుడే అనుకున్నాను” అని నిక్‌ కొనియాడాడు. గిల్‌ బ్యాటింగ్‌లో టెక్నిక్‌ను మరింత మెరుగుపర్చుకోవాలని.. ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌ దానిపైనే ఫోకస్‌ చేసే అవకాశముందని సూచించాడు.
పేసర్లకు అనుకూలం
పిచ్‌ తొలిరోజు పేసర్లకు అనుకూలించడం ఖాయమని లీడ్స్‌ గ్రౌండ్స్‌ హెడ్‌ రిచర్డ్‌ రాబిన్సన్‌ వివరించాడు. ‘ఇక్కడ అసాధారణంగా పొడి వాతావరణం వల్ల మంచి సర్ఫేస్‌ ఉన్న పిచ్‌ ఉండొచ్చు. ఇంగ్లండ్‌ టీమ్‌ కూడా ఇలాంటి ఉపరితలం ఉండే పిచ్‌నే కోరుకుంటోంది. తొలి రోజున పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకు సహాయపడుతుంది. ఈ తర్వాత వేడి కారణంగా క్రమంగా ఫ్లాట్‌గా మారొచ్చు. ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ క్రికెట్‌కు సరిపోవడమే కాకుండా.. అంతగా అనుభవం లేని టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌కు పరీక్ష పెట్టొచ్చు’ అని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడైనా సరే ఈ మైదానంలో టెస్ట్‌ సిరీస్‌ మధ్యలోని మ్యాచ్‌లను నిర్వహించేవారు. కానీ ఈసారి మొదటి మ్యాచ్‌తో సిరీస్‌ ఇక్కడే ప్రారంభం కాబోతోంది.
జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌
భారత్‌తో రేపటినుంచి ప్రారంభమయ్యే తొలిటెస్ట్‌కు ఇంగ్లండ్‌ జట్టు రెండ్రోజుల ముందే తుదిజట్టును ప్రకటించింది. 21ఏళ్ల యువ ఆల్‌రౌండర్‌ జాకోబ్‌ బేథెల్‌ను ప్రక్కన పెట్టిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు.. స్టార్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌కు చోటు కల్పించింది. అతడు 3వ స్థానంలో బమ్యాటింగ్‌కు దిగనున్నట్లు, ఆ తర్వాత 4వ స్థానంలో సీనియర్‌ బ్యాటర్‌ రూట్‌ క్రీజ్‌లోకి వస్తాడని పేర్కొంది. కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్‌, వికెట్‌ కీపర్‌గా జామీ స్మిత్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ఇసిబి పేర్కొంది.
తొలిటెస్ట్‌కు ఇంగ్లండ్‌ జట్టు: బెన్‌ స్టోక్స్‌(కెప్టెన్‌), క్రాలే, డకెట్‌, పోప్‌, రూట్‌, బ్రూక్‌, స్మిత్‌(వికెట్‌ కీపర్‌), వోక్స్‌, కర్సే, టోంగే, బషీర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -