ఆటో డ్రైవర్లను దోపిడీ చేస్తున్న ఫైనాన్సియర్లు : రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ
నవతెలంగాణ-హిమాయత్నగర్
జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసే ఉచిత ఆటో పర్మిట్లను ప్రయివేటు ఆటో ఫైనాన్సియర్లు అడ్డుకుంటే తాటతీస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ హెచ్చరించింది. ప్రయివేటు ఆటో ఫైనాన్షియర్లు తమ అక్రమ వ్యాపారంతో ఆటో డ్రైవర్లను నిలువు దోపిడీ చేసేందుకు ఉచిత ఆటో పర్మిట్లను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం మాట్లాడుతూ.. 12 ఏండ్లుగా ప్రయివేటు ఆటో ఫైనాన్షియర్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. కాలం చెల్లిన పాత ఆటోలను తుక్కుగా మర్చి ఆ పర్మిట్లపై కొత్త ఆటో కొనుగోలు చేస్తూ ఆర్టీఐ నిబంధనలను ఉల్లంగిస్తూ కోట్ల రూపాయలు అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. నేటికి సుమారు 80 వేల ఆటో పర్మిట్లు ఫైనాన్సియర్ల దగ్గర ఉన్నాయని, ఆటో షోరూం ధర రూ.2 లక్షల 70 వేలకు ఉంటే ఫైనాన్షియర్లు ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షలకు అమ్మి మధ్యలో రూ.2 లక్షల 30 వేలు అదనంగా లాగుతున్నారని వివరించారు. తమను శాశ్వత రుణగ్రస్తులుగా మర్చి వందల కోట్ల వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకొని ఆటోలను కొనుగోలు చేసిన డ్రైవర్లు కిస్తీలు చెల్లించలేకపోతున్నారని, దీంతో ఫైనాన్స్ సంస్థలు ఆటోలను స్వాధీనం చేసుకుని ఆ పర్మిట్లను మరో డ్రైవరుకు కట్టబెట్టి సొమ్ము చేసుకుంటున్నాయని చెప్పారు. నిరుద్యోగాన్ని రూపుమాపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉచిత ఆటో పర్మిట్ల జారీకి జీఓ జారీ చేసిందని, ఆటో ఫైనాన్షియర్లు ఈ జీఓను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఉచిత ఆటో పర్మిట్లను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వారి కార్యాలయాలను వేలాది మంది ఆటో డ్రైవర్లతో ముట్టడిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు ఎస్.అశోక్ (ఏఐటీయూసీ), అజరుబాబు (సీఐటీయూ), వి.మారయ్య, మహేష్ (బీఆర్టీయు), వి.ప్రవీణ్, లింగంగౌడ్ (టీయుసీఐ), ఎం.ఎ.సలీం, రఫీక్ (యుటీఏడీడబ్ల్యుఏ), తిరుమలేష్, సి.హెచ్. జంగయ్య, ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ఆటో పర్మిట్లను అడ్డుకుంటే తాటతీస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES