– మైరావణ నవలకు సాహిత్యయువ పురస్కారం
న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం బాలసాహిత్య, యువ పురస్కారాలను ప్రకటించింది. మొత్తంగా 24 భాషల్లో ఉత్తమ రచనలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్ రచించిన ‘కబుర్ల దేవత’ (స్టోరీ) పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం వరించగా.. ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైంది. భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో సుప్రసిద్ధమైన వ్యక్తులు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించి పలు పుస్తకాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు సిఫారసు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ పురస్కారానికి ఎంపికైన పుస్తకాల పేర్లను ప్రకటించింది. అయితే, ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారం ప్రకటించలేదు. దీంతో ఈ విభాగంలో 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే యువ పురస్కారాలు ప్రకటించారుఈ పురస్కార విజేతలకు త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డుగ్రహితకు జ్ఞాపికతో పాటు రూ.50వేల నగదు అవార్డుతో సన్మానిస్తారు. తెలుగు భాషకు సంబంధించి బాల సాహిత్య పురస్కారాలకు జ్యూరీ సభ్యులుగా కన్నెగంటి అనసూయ, డా.ఎం భూపాల్ రెడ్డి, కిలపర్తి దాలినాయుడు వ్యవహరించగా.. యువ పురస్కారాలకు జ్యూరీ సభ్యులుగా జీఎస్ చలం, కుప్పిలి పద్మ, పెద్దింటి అశోక్ కుమార్ ఉన్నారు.
‘కబుర్ల దేవత’కు కేంద్ర బాల సాహిత్య పురస్కారం
- Advertisement -
- Advertisement -