ఆదివాసీలను వెళ్లగొట్టేందుకే కొమరంభీం టైగర్ కారిడార్ : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కార్పొరేట్ సంస్థలకు అడవులను కట్టబెట్టేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 49 జీవోను తీసుకొచ్చాయనీ, దాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆదివాసీలు నివసిస్తున్న, వారు సాగు చేస్తున్న భూముల నుంచి వెళ్లగొట్టేందుకే కొమరంభీం టైగర్ కారిడార్ను తెచ్చాయని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులను తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ అటవీ విధానం ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల హక్కులను కాలరాస్తున్నదని చెప్పారు. అటవీ, ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఛత్తీస్ఘడ్ అటవీ ప్రాంతంలోని నాలుగు లక్షల ఎకరాలను అదానీకి అప్పజెప్పిందని వివరించారు. అటవీ ప్రాంతంలోని ఆదివాసీలను అక్కడి నుంచి వెళ్లగొట్టి టైగర్ కారిడర్ల పేరుతో భూములను తీసుకొంటుందని విమర్శించారు. రాష్ట్ర
49 జీవోను రద్దు చేయాలి
వ్యాప్తంగా 12 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలివ్వాలంటూ దరఖాస్తులు వస్తే, కేవలం నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలిచ్చిందని గుర్తు చేశారు. మిగిలిన ఎనిమిది లక్షల ఎకరాల సాగు భూమికి కూడా పట్టాలిస్తామంటూ కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని చెప్పారు. ఏడాది దాటినా హామీని అమలు చేయలేదని అన్నారు. పైగా పోడు సాగుదారులపై అటవీ అధికారులతో దాడులు చేయించి, కేసులు పెడుతున్నదని విమర్శించారు. తక్షణమే ఇలాంటి దుర్మార్గాలను విడనాడి, మిగిలినవారికి కూడా పోడు హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. వారిపై అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకో వాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాల్లేవనీ, వాటిలో ఖాళీగా ఉన్న డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సుల పోస్టులను భర్తీ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవి కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, పి ఆశయ్య, ఉడుత రవీందర్, పూసం సచిన్, ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, కొమరం భీం జిల్లా కార్యదర్శి కె రాజన్న, మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, నిర్మల్ జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ, నాలుగు జిల్లాల కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
49 జీవోను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES