రాష్ట్రంలో పదేండ్ల నుంచి ఎన్డీఏ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలపైనే ప్రధాని మోడీ ఆరోపణలు
పాట్నా : బీహార్లో సమస్యలకు కాంగ్రెస్, ఆర్జేడీలే కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఆరోపించారు. బీహార్లో గత పదేండ్ల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా ప్రధానమంత్రి మోడీ మాత్రం ఆ రాష్ట్రం యొక్క సమస్యలకు, వెనుకబాటుతనానికి ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్లపై ఆరోపణలు గుప్పించారు. ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో శుక్రవారం మోడీ పర్యటించారు. సివాన్ జిల్లాలోని జసోలిలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. రూ. 9.5 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేశారు. కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. బీహార్ రాజధాని పాట్నా నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వరకూ నడిచే వందేభారత్ రైలును కూడా మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సభలో మోడీ మాట్లాడుతూ ‘ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీలు బీహార్ వ్యతిరేక పార్టీలు, పెట్టుబడులను కూడా ఈ పార్టీలు వ్యతిరేకిస్తాయి. ఈ రెండు పార్టీలు బీహార్లో మాఫియా రాజ్, గూండారాజ్, అవినీతికి రక్షకులుగా ఉన్నాయి’ అని మోడీ ఆరోపించారు. అలాగే తన గురించి కూడా మోడీ గొప్పలు చెప్పుకున్నారు. ‘మోడీ ఇప్పటికీ విశ్రాంతి తీసుకోరు. పేదలు, దళితులు, ఈబీసీ, ఓబీసీల కోసం పని చేస్తూనే ఉంటారు’ అని మోడీ అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఉచిత రేషన్, విద్యుత్, నీరు ఇస్తోందని, లాంతరు గుర్తు కలిగినవారు (ఆర్జేడీ) దేశాన్ని దోచుకోవడంలో పాలుపంచుకున్నారని మోడీ తెలిపారు. అలాగే, వారు (ఆర్జేడీ) అంబేద్కర్ను అవమానిస్తారని, తాను అంబేద్కర్ను హృదయంలో ఉంచుకుంటానని అన్నారు. ఈ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా ప్రసంగించారు. ఇతర ఎన్డీఏ సీనియర్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలూ ఈ సభలో పాల్గొన్నారు. ఎన్నికలు జరిగే బీహార్లో ఈ ఏడాదిలో మోడీ పర్యటించడం ఇది నాలుగోసారి. రాష్ట్రంలో అక్టోబర్-నవంబర్ల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జనవరి 24, ఏప్రిల్ 24, మే 29, 30 తేదీల్లో మోడీ బీహార్లో పర్యటించారు. మేలో జరిగిన పర్యటనలో ఆపరేషన్ సిందూర్ గురించి మోడీ ప్రస్తావించారు. ఉగ్రవాదులకు జవాబు చెప్పే ఇక్కడకు వచ్చానని చెప్పారు.
కాగా, శుక్రవారం మోడీ బీహార్ పర్యటనకు ఒక రోజు ముందు, అంటే గురువారం ఆర్జేడీ నాయకులు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ”ప్రధాని మోడీ మరోసారి బీహార్ను మోసం చేయడానికి వస్తున్నారు. ఆయన లాలూ ప్రసాద్ను, నన్ను తిట్టడానికే ఇక్కడ ఉంటారు” అని అన్నారు. అలాగే ”నిరుద్యోగం, వలసలు” వంటి వాస్తవమైన సమస్యలను తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ప్రతిపక్షాలపై మోడీ ఆరోపణలు చేస్తారని కూడా అన్నారు. మోడీ అదే విధంగా ప్రసంగం చేయడం విశేషం.
బీహార్ సమస్యలకు కాంగ్రెస్, ఆర్జేడీలే కారణం
- Advertisement -
- Advertisement -